Sankranthi: రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరల పెంపు
- Author : hashtagu
Date : 10-01-2022 - 2:06 IST
Published By : Hashtagu Telugu Desk
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి అనే సాకుతో రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర ఏకంగా రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు ప్రకటించింది.
మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ప్లాట్ఫాం టికెట్ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. ఈ ధరలు ఈ నెల 20 వరకు కొనసాగుతాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది.
కాగా, పండుగ రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అనవసర రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోపక్క, ఇప్పటికే రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది.