Epic Haj Journey: సలాం షిహాబ్.. 8640 కిలోమీటర్లు నడిచి, మక్కాను దర్శించుకొని!
ఓ వ్యక్తి కేవలం కాలినడక ద్వారా మక్కాకు చేరుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.
- By Balu J Published Date - 01:37 PM, Sat - 10 June 23

తమ జీవితకాలంలో ముస్లింలు ఎవరైనా ఒకసారి మక్కాను దర్శించుకోవాలనుకుంటారు. కొందరు విమానాల్లో, బస్సుల ద్వారా వెళ్తూ తమ కలను సాకారం చేసుకుంటుంటారు. కానీ ఓ వ్యక్తి కేరళ నుంచి కేవలం నడక ద్వారా పవిత్ర నగరమైన మక్కాకు చేరుకున్నాడు. 370 రోజుల్లో అలుపెరగకుండా 8,640 కి.మీలు నడిచి హాజ్ యాత్ర కొనసాగించాడు. అతని పేరు షిహాబ్ ఛోటూర్. పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, చివరకు సౌదీ అరేబియా మీదుగా అతని నడక ప్రయాణం కొనసాగింది. సరిహద్దు దేశాల్లో ఎన్నో అడ్డంకులు ఏర్పడినప్పటికీ తన గమ్యానికి చేరుకున్నాడు. కేరళలోని మలప్పురం జిల్లాలోని వాలంచేరికి చెందిన షిహాబ్ చోటూర్ ఈ నెలలో మక్కా చేరుకున్నాడు.
కాలినడకన తన ప్రయాణంలో, షిహాబ్ భారతదేశం, పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ మరియు కువైట్లను దాటాడు. మే రెండవ వారంలో కువైట్ నుండి సౌదీ అరేబియా సరిహద్దుకు చేరుకున్నాడు. ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ప్రయాణాన్ని పూర్తి చేశాడు. సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తరువాత, షిహాబ్ ఒక ముఖ్యమైన ఇస్లామిక్ యాత్రా స్థలం అయిన మదీనాకు వెళ్ళాడు. మక్కా వెళ్లేముందు మదీనాలో 21 రోజులు గడిపారు. ఆ తర్వాత 440 కి.మీ నడిచి తొమ్మిది రోజుల్లో పవిత్ర నగరమైన మక్కాను చేరుకున్నాడు.
షిహాబ్ తన తల్లి జైనాబా కేరళ నుండి నగరానికి వచ్చిన తర్వాత హజ్ చేస్తారు. యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్న ఈ వ్యక్తి కాలినడక ద్వారా మక్కాకు వెళ్లాలనుకున్నాడు. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రం నుండి పవిత్ర నగరమైన మక్కాకు తన ప్రయాణం గురించి తన వీక్షకులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాడు. అతని ధైర్యానికి, దైవభక్తికి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు.
Also Read: IAS Sandeep Kumar Jha: ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా ‘వరకట్నం’ వేధింపులు.. కోర్టకెక్కిన భార్య!