Karnataka Farmers : తెలంగాణ పథకాలే మాకు ఇవ్వండి.. ప్రభుత్వానికి కర్ణాటక రైతుల డిమాండ్
తమకు తెలంగాణ రైతులకు ఇచ్చిన పథకాలే ఇవ్వాలంటూ కర్ణాటక రైతులు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నాటక.../
- By Prasad Published Date - 02:08 PM, Tue - 27 September 22

తమకు తెలంగాణ రైతులకు ఇచ్చిన పథకాలే ఇవ్వాలంటూ కర్ణాటక రైతులు ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నాటక ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు రైతులకు ఉచిత నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. వివిధ రైతు సంఘాల మద్దతుతో అనేక వందల మంది చెరకు రైతులు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కు చేరుకుని రాష్ట్ర అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. చెరకు పంటకు కనీస మద్దతు ధరను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ తమిళనాడు, కర్నాటక, ఇతర రాష్ట్రాల నుంచి రైతులు కూడా ర్యాలీలో పాల్గొనేందుకు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కు తరలివచ్చారు. అయితే వారందరినీ రైల్వే స్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చిన ‘చలో విధాన సౌధ’ నిరసన కోసం దక్షిణ భారత రైతు సమాఖ్య బ్యానర్ కింద పలువురు రైతు సంఘాల నాయకులు కూడా నగరానికి చేరుకున్నారు. రైతు బంధు పెట్టుబడి మద్దతు, రైతు బీమా కవరేజీ, వ్యవసాయ రంగానికి ఉచిత నిరంతర విద్యుత్ సహా తెలంగాణ మోడల్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు చేతపట్టారు. ‘మాకు రైతు బంధు కావాలి’, ‘మాకు జీవిత బీమా కావాలి’, ‘మాకు తెలంగాణ మోడల్ పథకాలు కావాలి’ అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను తమిళనాడు రైతు నాయకులు, కర్ణాటక రైతులు కూడా పట్టుకున్నారు.