Mutton Pulao: రెస్టారెంట్ స్టైల్ మటన్ పలావ్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?
మామూలుగా చాలామంది మటన్ తో చాలా తక్కువ ఐటమ్స్ ని చేసుకుని తింటూ ఉంటారు. మటన్ కర్రీ, మటన్ వేపుడు, మటన్ బిర్యానీ ఇప్పుడు ఒకే రకమై
- Author : Anshu
Date : 16-08-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా చాలామంది మటన్ తో చాలా తక్కువ ఐటమ్స్ ని చేసుకుని తింటూ ఉంటారు. మటన్ కర్రీ, మటన్ వేపుడు, మటన్ బిర్యానీ ఇప్పుడు ఒకే రకమైన వంటలు తింటూ ఉంటారు.. అయితే ఎప్పుడైన మటన్ పలావ్ తిన్నారా. మరి మటన్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మటన్ పలావ్ కి కావలసిన పదార్థాలు :
మటన్ – అరకేజీ
బాస్మతీ బియ్యం – ఒక కేజీ
కొబ్బరికాయ – ఒకటి
నెయ్యి -నాలుగు స్పూన్లు
జీడిపప్పు – కొద్దిగా
ఉల్లిపాయలు – నాలుగు
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – కొద్దిగా
ధనియాలు – రెండు స్పూన్లు
గసగసాలు – కొద్దిగా
పుదీనా – ఒక కట్ట
కొత్తిమీర – ఒక కట్ట
పచ్చిమిరపకాయలు – ఆరు
నూనె – తగినంత
ఉప్పు – తగినంత
బిర్యానీ ఆకులు – రెండు
పెరుగు – రెండు కప్పులు
మటన్ పలావ్ తయారుచేయు విధానం:
ముందుగా బాస్మతీ బియ్యాన్ని ఆరగంట సేపు నానబెట్టాలి. గసగసాలు నూనె లేకుండా వేపి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గసగసాలు, పచ్చికొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. పూదీనా, కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మటన్ శుభ్రంగా కడిగి అందులో పుసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించాలి. ఒక పెద్ద గిన్నెను పొయ్యి మీద పెట్టి అందులో నెయ్యి వేసి ఉల్లిపాయముక్కలు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇవి వేగుతుండగా జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరి, గసగసాల పేస్ట్, బిర్యానీ ఆకులు, పెరుగు వేసి కొంచెం నూనె వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేగుతున్న మసాలలో వేసి కలిపి, నానబెట్టుకున్న బాసుమతి బియ్యాన్ని కూడా వేసి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకుని బాగా కలిపి, ఉప్పు, కారం వేసి చిన్న మంట మీద పెట్టి ఉడికించాలి. పదిహేను నిమిషాల తరవాత దించుకోవాలి. అంతే ఎంతో రుచిగా వుండే మటన్ పలావ్ రెడీ.