Today Release : నేడే విడుదల.. 13 రోజుల తర్వాత టన్నెల్ బయటికి 41 మంది ?
Today Release : ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. గత 13 రోజులుగా 41 మంది కార్మికులు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో చిక్కుకుపోయారు.
- By Pasha Published Date - 07:25 AM, Fri - 24 November 23

Today Release : ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. గత 13 రోజులుగా 41 మంది కార్మికులు ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో చిక్కుకుపోయారు. ఆ టన్నెల్లో వారంతా కలిసి నిర్మాణ పనులు పనిచేస్తుండగా.. ఈనెల 12న అకస్మాత్తుగా టన్నెల్లోని ఓ భాగం కూలిపోయింది. దీంతో వారు ఉన్న ప్రదేశానికి దారి మూసుకుపోయింది. కూలిపోయిన సొరంగం భాగాన్ని అడ్డు తొలగించేందుకు గత 13 రోజులుగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నంకల్లా రెస్క్యూ వర్క్స్ పూర్తవుతాయని, కార్మికులంతా బయటికి వచ్చేస్తారని ఉన్నతాధికారులు, ఉత్తరాఖండ్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాక్షాత్తూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా గురువారం రాత్రి సొరంగం దగ్గరే టెంట్ వేసుకొని బస చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బయటికి వచ్చే కార్మికులకు స్వాగతం పలికేందుకే ఆయన అక్కడ ఉన్నారని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు గత 13 రోజులుగా సొరంగం లోపలే ఉండటం వల్ల కార్మికుల ఆరోగ్యాలు క్షీణించాయి. వారు డీహ్రైడేషన్, శ్వాసపరమైన సమస్యలు, కంటిచూపు మందగించడం వంటి ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నారు. వారంతా సొరంగం నుంచి బయటికి రాగానే ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులను రెడీగా ఉంచారు. వాస్తవానికి గురువారం రోజు రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవుతుందని.. గురువారం సాయంత్రంకల్లా కార్మికులు బయటికి వస్తారని అందరూ భావించారు. కానీ అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మెషీన్ దాదాపు మూడుసార్లు చెడిపోవడంతో పదేపదే పని ఆగిపోయింది. దాన్ని గురువారం రాత్రంతా రిపేర్ చేశారు. ఇవాళ ఉదయం మళ్లీ రెస్యూ వర్క్స్ను మొదలుపెట్టి మధ్యాహ్నంకల్లా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.