Tiger Attack : దుధ్వా రిజర్వ్ ఫారెస్ట్ లో దారుణం.. 61 ఏళ్ల వ్యక్తిని చంపేసిన పులి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా బఫర్ జోన్లోని మైలానీ శ్రేణి ఫారెస్ట్ లో దారుణం చోటుచేసుకుంది.
- By Dinesh Akula Published Date - 12:18 PM, Sun - 27 March 22

ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని దుధ్వా బఫర్ జోన్లోని మైలానీ శ్రేణి ఫారెస్ట్ లో దారుణం చోటుచేసుకుంది. పులి దాడిలో 61 ఏళ్ల వ్యక్తి మరణించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు పర్వత్పూర్ గ్రామానికి చెందిన షరాఫత్గా గుర్తించామని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సంజయ్ పాఠక్ తెలిపారు. శనివారం సాయంత్రం అతని మృతదేహాన్ని అడవి లోపల నుండి స్వాధీనం చేసుకున్నారు. అతను శుక్రవారం పశువులను మేపడానికి అడవిలోకి వెళ్లాడని, ఇంటికి తిరిగి రాలేదని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు షరాఫత్ కోసం వెతికినా అతని ఆచూకీ లభించలేదని ఫారెస్ట్ అధికారి తెలిపారు. శనివారం నాడు పాక్షికంగా మాయం అయిన మృతదేహాన్ని స్థానికులు కొందరు చూసి అతని సమాచారం ఇవ్వడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈలోగా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు మరియు ఆ ప్రాంతంలోని స్థానిక గ్రామాల నివాసితులు ఒంటరిగా బయటకు రావద్దని కోరారు.