Supreme Court: నూపుర్ వ్యాఖ్యలపై ‘సుప్రీం’ సీరియస్!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది.
- Author : Balu J
Date : 01-07-2022 - 1:26 IST
Published By : Hashtagu Telugu Desk
టీవీ చర్చల సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. ఆమె వ్యాఖ్యలు దేశం మొత్తాన్ని మంటల్లోకి నెట్టిందని, ఉదయ్పూర్లో జరిగిన దురదృష్టకర సంఘటనకు కారణం నూపుర్ వాఖ్యల ఫలితమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు సూర్యకాంత్, J.B. పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ శర్మ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆమె వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ధర్మాసనం “ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. నూపుర్ వల్లే ఉదయపూర్లో జరిగింది… దయచేసి మా నోరు తెరవమని మమ్మల్ని బలవంతం చేయవద్దు” అని ధర్మాసనం నూపుర్ తరపు న్యాయవాదికి తెలిపింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. తనపై పలు రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్ఐఆర్లను బదిలీ చేయాలని కోరుతూ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఎదురవుతున్నాయని శర్మ వాదించారు. ఆమె అభ్యర్థనను స్వీకరించడానికి తమకు ఆసక్తి లేదని ఆమె న్యాయవాది, సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్కు ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని మతాలవారు ప్రతి మతాన్ని గౌరవిస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు మతస్థులు కాదని బెంచ్ తెలిపింది.