Rajasthan Election 2023 Polling : రాజస్థాన్ కా రాజా కౌన్..?
రాజస్థాన్ రాజకీయ చరిత్రలో అక్కడ ఏ పార్టీ రెండోసారి వరుసగా అధికారానికి రాలేదు
- By Sudheer Published Date - 06:40 PM, Sat - 25 November 23
డా. ప్రసాదమూర్తి
ఎన్నికల సీజన్లో నాలుగో రాష్ట్రం రాజస్థాన్ లో ఈరోజు పోలింగ్ దశ ముగిసింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బిజెపి హోరాహోరీ ఎన్నికల ప్రచారం సాగించారు. రాజస్థాన్ రాజకీయ చరిత్రలో అక్కడ ఏ పార్టీ రెండోసారి వరుసగా అధికారానికి రాలేదు. ప్రతి ఐదేళ్లకు ఒక ప్రభుత్వం మారడం రాజస్థాన్లో సంప్రదాయంగా వస్తున్న చరిత్ర. ఈ సంప్రదాయం ఈ ఆనవాయితీ ఈసారి మారుతుందా లేక రాజస్థాన్ ఓటర్లు చరిత్ర క్రమాన్ని మార్చి కొత్త చరిత్ర సృష్టిస్తారా అనే అంశమే ఇప్పుడు కీలకం. ప్రతిసారి అధికారంలో ఉన్న పార్టీ పట్ల రాజస్థాన్ ప్రజలలో అసంతృప్తి ఆ పార్టీ పరాజయం కావడానికి కారణమయ్యేది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న అశోక్ గెహ్లోట్ ప్రజలలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారా అనే విషయం స్పష్టంగా ఎన్నికలలో తేలలేదు.
అనేక మీడియా సంస్థల సర్వేలు, స్వతంత్ర జర్నలిస్టుల ఇంటర్వ్యూలు, గ్రౌండ్ రిపోర్టులు, రాజకీయ మేధావుల అంచనాలు, విశ్లేషణలు చూస్తే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పట్ల ప్రజలు ఇప్పటికీ సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన క్లీన్ ఇమేజ్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి అన్నిటికంటే ముఖ్యమైన ప్లస్ పాయింట్ గా మారింది. దానికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలలో బాగా సానుకూలమైన స్పందనను పొందాయి. పేద ప్రజలకు అనుకూలమైనటువంటి పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో విజయం సాధించినట్లుగా కనిపిస్తోంది.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు మొబైల్ ఫోన్లు, 25 లక్షల రూపాయలతో చిరంజీవి అనే ఆరోగ్య భీమా పథకం మొదలైన ఏడు ప్రముఖ గ్యారంటీ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అక్కడ అమలు చేసింది. అందుకే ఎక్కడా ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ పట్ల అసంతృప్తి మాత్రం ప్రజల్లో కనిపించలేదు. అలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాదు బీహార్ తరహా రాజస్థాన్లో కూడా క్యాస్ట్ సర్వే చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకే ఎక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మాత్రం వ్యక్తం కావడం లేదు.
ప్రతికూల అంశాలు:
అయితే రాజస్థాన్లో గెహ్లాట్ ప్రభుత్వానికిప్రతికూలమైన కొన్ని అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే రాజస్థాన్లో కూడా పరీక్ష పత్రాల లీకేజీ నిరుద్యోగులలో పెద్ద అసంతృప్తికి కారణంగా మారింది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్ల కాలంలో చాలా ఆస్తులు సంపాదించుకున్నారని, ధనవంతులయ్యారని ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలామందికి కాంగ్రెస్ పార్టీ సిట్లు ఇచ్చింది. కేవలం 17 మంది ఎమ్మెల్యేలను మాత్రమే మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న ప్రజల అసంతృప్తి పార్టీకి ప్రతికూలంగా మారితే పరిణామాలు కూడా ప్రతికూలంగా ఉండవచ్చు అనేది ఒక అంచనా ఉంది.
వీటికి తోడు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ క్లీన్ ఇమేజ్ కి సరిపడా బిజెపి అభ్యర్థి మరొకరు లేకపోవడం వల్ల అక్కడ పోటీని గెహ్లాట్ వర్సెస్ మోడీగా బిజెపి మార్చింది. రాజస్థాన్లో సంక్షేమ పథకాల విషయంలో గాని, ప్రభుత్వం పనితీరులో గాని ఎదుర్కొనే సామర్థ్యం లేక బిజెపి అక్కడ హిందుత్వ కార్డును తీసుకువచ్చింది. కానీ అది రాజస్థాన్లో పెద్దగా వర్కవుట్ అవుతుందని చెప్పలేం. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధర రాజేని బిజెపి ప్రొజెక్టు చేయలేదు. అందుకే అక్కడ ప్రచారం అంతంత మాత్రంగానే వసుంధర రాజే చేసారు.
ఈ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేం. మొత్తానికి రాజస్థాన్లో ప్రతి ఐదేళ్లకు సర్కారు మారుతుందనే సంప్రదాయాన్ని ఈసారి ఓటర్లు తిప్పి కొడతారో, మళ్లీ అదే సంప్రదాయాన్ని తిరిగి కొనసాగిస్తారో మూడో తేదీన మాత్రమే తేలుతుంది. అక్కడ తిరిగి విజయం సాధిస్తే అది కాంగ్రెస్ పార్టీకి అతి గొప్ప ల్యాండ్ మార్క్ విక్టరీ అవుతుంది. లేదా బిజెపి విజయం సాధిస్తే బిజెపికి అది అనూహ్యమైన లాభంగా దేశవ్యాప్త ఎన్నికలలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మరి రాజస్థాన్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Related News
PM Modi: అంబేడ్కర్ మళ్లీ వచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరు: మోదీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. సోనియా గాంధీ మాట్లాడుతూ.. మోడీ దేశ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని సోనియా గాంధీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.