Venkaiah Naidu : వెంకయ్యకు ఉప రాష్ట్రపతిగా రెండో టర్మ్ లేనట్టే.. తెరపైకి ముక్తార్ అబ్బాస్ నక్వి!?
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే ప్రతిపాదిస్తుందని ప్రచారం జరిగింది.. కానీ అలా జరగలేదు. ఉప రాష్ట్రపతి పదవిలో రెండో టర్మ్ కూడా వెంకయ్య నాయుడును కొనసాగించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది.
- By Hashtag U Published Date - 11:22 AM, Thu - 7 July 22
రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరును ఎన్డీయే ప్రతిపాదిస్తుందని ప్రచారం జరిగింది.. కానీ అలా జరగలేదు. ఉప రాష్ట్రపతి పదవిలో రెండో టర్మ్ కూడా వెంకయ్య నాయుడును కొనసాగించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. కానీ అది కూడా జరిగేలా లేదు. ఎందుకంటే.. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థుల జాబితా రోజురోజుకు పెరుగుతూ పోతోంది. తాజాగా కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. దీంతో ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి నామినేషన్ వేయించేందుకు ముక్తార్ అబ్బాస్ నక్వితో రాజీనామా చేయించారనే ప్రచారం మొదలైంది. బీజేపీకి ప్రస్తుతం పవర్ హౌజ్ లా మారిన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నక్వి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అత్యంత కీలకంగా మారనుంది. ఈనేపథ్యంలోనే యూపీకి చెందిన నేత ముక్తార్ అబ్బాస్ నక్విని ఉప రాష్ట్రపతి చేయాలని మోడీ, అమిత్ షా, నడ్డా ప్రత్యేక భేటీలో నిర్ణయించినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు తీవ్ర నిరసన ఎదురైంది. ఈనేపథ్యంలో ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఉపరాష్ట్రపతిగా మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మీడియాలో మరో విధమైన ప్రచారం కూడా జరుగుతోంది. ముక్తార్ అబ్బాస్ నక్విని ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపించే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి నఖ్వీ రాజ్యసభ పదవీకాలం గురువారం (నేటితో) ముగియనుండగా.. దాన్ని బీజేపీ పొడించగలేదు. దీంతో ఆయన బుధవారం (జులై 6) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ.. నఖ్వీపై ప్రశంసలు గుప్పించినట్లు సమాచారం.
ముస్లిం వ్యక్తే బరిలో ?
బీజేపీపై హిందూత్వ ముద్ర ఉండటంతో.. ఆ పార్టీ మైనార్టీలకు చేరువ కాలేకపోతోంది. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటించింది. ఆయనే రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో.. మైనార్టీలకు తాము వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపడం కోసం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కావొచ్చు, అరిఫ్ మొహమ్మద్ ఖాన్ కావొచ్చు.. మొత్తంమీద ముస్లిం వ్యక్తే బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Related News
Jagdeep Dhankhar : భారత 14వ ఉపరాష్ట్రపతిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జగదీప్ ధంఖర్
భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ నేడు (గురువారం) ప్రమాణ స్వీకారం