Man Ate Spoons: స్పూన్లు, టూత్ బ్రష్లు మింగిన వ్యక్తి: రిహాబ్ సెంటర్పై కోపంతో అర్థంలేని పని
సచిన్కు మత్తు పదార్థాలపై వ్యసనం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని గజియాబాద్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు.
- Author : Dinesh Akula
Date : 25-09-2025 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
హాపుడ్, ఉత్తరప్రదేశ్: (Man Ate Spoons)- ఉత్తరప్రదేశ్ హాపుడ్ జిల్లాలో అనూహ్యమైన ఘటన జరిగింది. బులంద్శహర్కు చెందిన సచిన్ అనే 40 ఏళ్ల వ్యక్తి, కుటుంబ సభ్యులు తనను డీ-అడిక్షన్ సెంటర్ (rehab center)లో చేర్చిన కోపంతో, ఒక్కసారిగా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్లు మింగేశాడు. ఈ ఘటనతో అతడు తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
సచిన్కు మత్తు పదార్థాలపై వ్యసనం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని గజియాబాద్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. అయితే, ఇది తనపై బలాత్కారంగా చేసిన పని అనుకున్న సచిన్, ఆ కోపంతో సెంటర్లో ఉన్న స్పూన్లు, టూత్ బ్రష్లను బాత్రూమ్కు తీసుకెళ్లి వాటిని ముక్కలుగా చేసి మింగేశాడు. తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో హాపుడ్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చేసిన ఎక్స్రే, అల్ట్రాసౌండ్ టెస్టుల్లో ఆశ్చర్యకర ఫలితాలు బయటపడ్డాయి—సచిన్ కడుపులో 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్లు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఎండోస్కోపీ ద్వారా తొలగించేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. అనంతరం తక్షణ శస్త్రచికిత్స చేసి అన్ని వస్తువులను కడుపులో నుంచి బయటకు తీశారు. ఈ ఆపరేషన్ విజయవంతమవడంతో ప్రస్తుతం సచిన్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన వైద్యుడు డాక్టర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, “నా ప్రాక్టీస్లో ఇలాంటి కేసు ఇదే మొదటిసారి. స్పూన్లు, బ్రష్లు ఇలా మింగడం చాలా ప్రమాదకరం. భాగ్యశాత్తూ సర్జరీ విజయవంతమైంది,” అని తెలిపారు.
ఇక సచిన్ ఈ విషయం పై స్పందిస్తూ,
“నన్ను చికిత్స పేరుతో తీసుకువెళ్లి డీ-అడిక్షన్ సెంటర్లో లాక్ చేశారు. మమ్మల్ని ఇలానే బంధిస్తారా అన్న కోపంతో స్పూన్లు, బ్రష్లు తినేశా,” అని చెప్పాడు.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనా బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. ఓ 37 ఏళ్ల మహిళ టూత్ బ్రష్ మింగింది. కానీ ఆమె మింగిన విషయాన్ని వైద్యులకు చెప్పకపోవడంతో, దాదాపు 45 నిమిషాలపాటు ఎండోస్కోపీ ద్వారా బ్రష్ను తీసే ప్రక్రియ సాగింది. చివరికి బ్రష్ను విజయవంతంగా తొలగించారు.
ఈ రకమైన కేసులు చాలాచోట్ల అరుదుగా కనిపిస్తున్నప్పటికీ, వాటి పైన సమయానికి చికిత్స లేకపోతే ప్రాణాపాయంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.