Lok Sabha Elections : లోక్సభ ఎన్నికల 4 దశల్లో భారీగా 67 శాతం ఓటింగ్
లోక్ సభ ఎన్నికల తొలి నాలుగు దశల పోలింగ్కు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
- By Pasha Published Date - 06:46 PM, Thu - 16 May 24

Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల తొలి నాలుగు దశల పోలింగ్కు సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తొలి నాలుగు విడతలలో జరిగిన ఎన్నికల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైందని గురువారం ప్రకటించింది. ఈ నాలుగు దశల్లో 97కోట్ల మంది ఓటర్లలో 45.10 కోట్ల మంది ఓటు వేశారని తెలిపింది. వచ్చే మూడు విడతల్లో పెద్దసంఖ్యలో ఓట్లు వేయాలని ప్రజలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. ‘‘అధిక శాతం ఓటింగ్ నమోదు కావడం అనేది భారత ప్రజాస్వామ్యం బలం గురించి ప్రపంచానికి ఓటరు ఇచ్చిన సందేశం.ఈసీ అభ్యర్థన మేరకు పలు సంస్థలు, సినీ నటులు, ప్రముఖులు ఓటు హక్కు గురించి ఓటరుకు అవగాహన కల్పిస్తుండటం చాలా మంచి విషయం. ఓటింగ్ రోజు సెలవు దినం కాదు. ఓటర్లు ఓటు వేసి గర్వించాల్సిన రోజు. మిగతా మూడు విడతల్లో భారీగా పోలింగ్ జరగాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు దశల్లో 379 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 20న ఐదో దశ, మే 25న ఆరోదశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్(Lok Sabha Elections) జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
- లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న జరిగింది. ఇందులో 66.14 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో లోక్సభ ఎన్నికల తొలి దశలో 69.43 శాతం ఓటింగ్ జరిగింది.
- లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 26న జరిగింది. దీనిలో 66.71 శాతం మంది ఓటు వేశారు. 2019లో లోక్సభ ఎన్నికల రెండో దశలో 69.64శాతం పోలింగ్ నమోదైంది.
- లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ మే 7న జరిగింది. ఇందులో 65.68 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. 2019లో లోక్సభ ఎన్నికల మూడో దశలో 68.4 శాతం పోలింగ్ నమోదైంది.
- లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ మే 13న జరిగింది. ఇందులో 69.16 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. 2019లో లోక్సభ ఎన్నికల మూడోదశలో ఇంతకంటే 3.65 శాతం ఎక్కువే ఓటింగ్ నమోదైంది.