Jyoti Malhotra : మొత్తం విషయాలు బయటపెట్టిన జ్యోతి మల్హోత్రా
Jyoti Malhotra : "అవును.. నాకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ (Pakistan Intelligence) ఏజెంట్లతో సంబంధాలున్నాయి" అని ఆమె అంగీకరించిందని హిసార్ పోలీసులు వెల్లడించారు
- Author : Sudheer
Date : 21-05-2025 - 4:49 IST
Published By : Hashtagu Telugu Desk
దేశద్రోహం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) విచారణలో సంచలన విషయాలను బయటపెట్టింది. “అవును.. నాకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ (Pakistan Intelligence) ఏజెంట్లతో సంబంధాలున్నాయి” అని ఆమె అంగీకరించిందని హిసార్ పోలీసులు వెల్లడించారు. 2023లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ను సందర్శించిన జ్యోతి, అక్కడ డానిష్ అనే అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిపింది. అతని ద్వారా పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా పొందిందని, రెండు సార్లు అక్కడికి వెళ్లినట్లు వెల్లడించింది.
Kumki Elephants : ఆ బాధ్యత నేను తీసుకుంటా – హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్
పాకిస్థాన్ ప్రయాణాల్లో డానిష్ తనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాడని, అలీ హసన్ అనే వ్యక్తి ద్వారా షకీర్, రాణా షాబాజ్ అనే నిఘా అధికారులు పరిచయం అయినట్లు తెలిపింది. షకీర్ అనే పాక్ ఏజెంట్ నంబర్ను తన ఫోన్లో “జాట్ రాధావన్” అనే పేరుతో సేవ్ చేసుకొని, అనుమానం రాకుండా వ్యవహరించినట్లు చెప్పింది. పాకిస్తాన్ ఏజెంట్లతో తన కాంటాక్ట్ ఎక్కువగా స్నాప్చాట్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి యాప్స్లోనే సాగిందని, వీటి ద్వారా దేశానికి సంబంధించిన కీలక సమాచారం పంచుకున్నట్లు అంగీకరించింది. అలాగే భారత త్రివిధ దళాల మోహరింపు, సరిహద్దు ప్రాంతాల రహస్య సమాచారం, ముఖ్యంగా అట్టారి మరియు రాజస్థాన్ ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన వివరాలను పాక్ నిఘా సంస్థలకు అందించినట్లు తెలిపింది. ఈ సమాచారం ఆమె సురక్షిత IDల ద్వారా పంచుకుందని అధికారులకు వెల్లడించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన దేశ భద్రత వ్యవస్థపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఈ కేసులో మరిన్ని దర్యాప్తులు కొనసాగుతున్నాయని హర్యానా పోలీసులు వెల్లడించారు.