Marriage with lord vishnu:విష్ణు భగవానుడిని పెళ్లి చేసుకున్న యువతి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
భగవాన్ విష్ణువును జైపూర్ కు చెందిన పూజా సింగ్ అనే యువతి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది
- Author : Anshu
Date : 15-12-2022 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
పుట్టడం, పెరగడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలను కనడం, వారిని చూసుకోవడం అనేవి ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణం అయిపోయాయి. అయితే కొంతమంది మాత్రం వీటికి భిన్నంగా ఆలోచిస్తుంటారు. వారు ఈ పెళ్లి అనే కాన్సెప్టును తమదైన దృష్టిలో చూస్తుంటారు. పెళ్లికి వారు చెప్పే నిర్వచనం ఎంతో భిన్నంగా ఉంటుంది.
తాజాగా జైపూర్ కు చెందిన ఓ అమ్మాయి సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అయితే ఆమె పెళ్లి చేసుకున్నది ఎవర్నో తెలిస్తే మాత్రం షాక్ అవడం ఖాయం. ఆమె పెళ్లి చేసుకుంది భగవాన్ విష్ణువుని. అవును శ్రీమాన్ భగవాన్ విష్ణువును తన భర్తగా చేసుకున్న పూజా సింగ్ అనే అమ్మాయి కథ ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
30 సంవత్సరాల పూజా సింగ్ భగవాన్ విష్ణువును హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. తండ్రికి ఏమాత్రం ఇష్టం లేని ఈ పెళ్లికి ఆయన రాకపోగా.. పూజా సింగ్ తల్లి మాత్రం ఈ పెళ్లిని దగ్గరుండి నిర్వహించింది. పూజా సింగ్ తల్లి రతన్ కన్వర్ కాళ్లు కడిగి కన్యాదానం చేసింది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగింది.
మామూలు పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను ఆరాధించే విష్ణువును పెళ్లి చేసుకున్నట్లు పూజా సింగ్ తెలిపింది. ఆమె మాటల ప్రకారం.. ‘చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తతలు గొడవలు పడటం చూశాను. గొడవల కారణంగా వాళ్ల జీవితాలు నాశనం కావడం గమనించాను. అయితే ఎక్కువగా నష్టపోయేది మాత్రం ఆడవాళ్లే. అందుకే నేను విష్ణువును పెళ్లి చేసుకున్నా’ అని వివరించింది. కాగా పూజా సింగ్ ది జైపూర్ లోని నర్సింగ్ పురా గ్రామం.