లోక్సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!
అప్నా దళ్ (ఎస్) ఎంపీ అనుప్రియా పటేల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఈ మూడు బిల్లులకు తన మద్దతు ప్రకటించారు.
- Author : Gopi
Date : 17-04-2026 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Seats: మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి, లోక్సభ సీట్ల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. 16 ఏప్రిల్ 2026న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ బిల్లులను లోక్సభలో చర్చకు తీసుకువచ్చారు. 2029 నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం. దీనితో పాటు లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుండి 850కి పెంచే ప్రతిపాదనను కూడా ఉంచారు.
ఈ ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మూడు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టింది.
- రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు 2026
- నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు 2026
- కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2026
Also Read: Indonesia Helicopter Crash: ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది మృతి
ఈ బిల్లుల ద్వారా పార్లమెంట్, రాష్ట్రాల సీట్ల పునఃపంపిణీ జరుగుతుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మార్గం సుగమం అవుతుంది. దీని కోసం జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ బిల్లులను ఆమోదించడం ప్రభుత్వానికి అంత సులభంగా కనిపించడం లేదు. విపక్ష వర్గాల సమాచారం ప్రకారం.. ఈ బిల్లులు నెగ్గాలంటే కనీసం 345 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద దాదాపు 302 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉందని, అందువల్ల ప్రస్తుత స్థితిలో ఈ బిల్లులు పాస్ అవ్వడం కష్టమని విపక్షాలు వాదిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఈ అంశంపై భారీ రాజకీయ ఘర్షణ చోటుచేసుకునే అవకాశం ఉంది.
మూడు బిల్లులకు అనుప్రియా పటేల్ మద్దతు
అప్నా దళ్ (ఎస్) ఎంపీ అనుప్రియా పటేల్ మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ఈ మూడు బిల్లులకు తన మద్దతు ప్రకటించారు. లోక్సభలో మహిళల భాగస్వామ్యం ఇంకా చాలా తక్కువగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సభలో కేవలం 14 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, ఈ నిరాశాజనక స్థితి మారాలని ఆమె అన్నారు. ఈ కొత్త బిల్లుల ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు.
లోక్సభ సీట్ల సంఖ్య పెరగడం వల్ల అటు చిన్న పార్టీలకు, ఇటు పెద్ద పార్టీలకు మేలు జరుగుతుందని అనుప్రియా పటేల్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో విపక్షాలపై ఆమె విమర్శలు గుప్పించారు. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు 543 సీట్లలోనే 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ రోజు కుల గణన గురించి మాట్లాడుతున్న వారు తమ హయాంలో దీనిపై ఎందుకు గట్టి చర్యలు తీసుకోలేదని నిలదీశారు.