Kejriwal : సుప్రీంకోర్టులో అర్వింద్ కేజ్రీవాల్కు చుక్కెదురు
- By Latha Suma Published Date - 04:18 PM, Wed - 10 April 24
Supreme court : సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ(Urgent inquiry) చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi liquor case)లో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం సబబేనని వ్యాఖ్యానించింది. లిక్కర్ పాలసీ ద్వారా కేజ్రీవాల్ లబ్ధిపొందడానికి ప్రయత్నించినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
దాంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ను సింఘ్వి కోరారు. కానీ కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణకు సీజేఐ నిరాకరించారు. ‘ఆ పిటిషన్ సంగతి తర్వాత చూస్తాం’ అని వ్యాఖ్యానించారు. దాంతో తన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ కోసం కేజ్రీవాల్ ఈ వారాంతం వరకు వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Read Also: TDP Leaders Protest at Undi : ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్..
కాగా, మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించగానే ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మద్యం పాలసీ కేసు కేజ్రీవాల్ను, ఆయన పార్టీని అణచివేసేందుకు జరిగిన ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపించారు. హైకోర్టు తీర్పు తమకు ఆమోదయోగ్యంగా లేదని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. మద్యం పాలసీ కేసుల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ, సీబీఐ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అక్రమ సొమ్మును రికవరీ చేయలేదన్నారు.