GST Council Meeting: పాత కార్లు, పాప్ కార్న్, రెడీమేడ్ దుస్తులపై ‘కౌన్సిల్’ కీలక చర్చలు
ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ(GST Council Meeting) విధిస్తున్నారు.
- Author : Pasha
Date : 21-12-2024 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
GST Council Meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం రాజస్థాన్లోని జైసల్మీర్లో శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జీవిత బీమా, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తొలగింపు అంశం ప్రస్తావనకు రాగా.. మరింత పరిశీలన అవసరం అని మండలి అభిప్రాయపడింది. దీంతో సామాన్యులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇతర అంశాలపై మండలిలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది. పాత ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు పాటు చిన్న పెట్రోల్/డీజిల్ కార్లపై ప్రస్తుతమున్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచాలన్న ప్రపోజల్పై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పెద్ద కార్లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. దాన్నే చిన్న తరహా కార్లకు కూడా వర్తింపచేయాలని యోచిస్తున్నారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపైనా డిస్కషన్ జరుగుతోంది. అదే జరిగితే విమాన టికెట్ల ధరలు మరింత పెరిగిపోతాయి.
Also Read :WhatsApp Vs Pegasus : ఆ దుశ్చర్య ఇజ్రాయెల్ కంపెనీదే.. భారత్ సహా ఎన్నోదేశాల వాట్సాప్ యూజర్లపై నిఘా
- రూ.1500 దాకా రేటు ఉండే రెడీమేడ్ దుస్తులపై 5 శాతం జీఎస్టీ, రూ.1500- 10,000 మధ్య రేటు ఉండే దుస్తులపై 18 శాతం జీఎస్టీ, రూ.10,000 పైచిలుకు ధర కలిగిన దుస్తులపై 28 శాతం జీఎస్టీని విధించాలని ఇప్పటికే కేంద్ర సర్కారు నిర్ణయించింది. అయితే ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
- 148 వస్తువులపై విధించే జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణకు ఏర్పాటైన మంత్రుల బృందం ప్రపోజ్ చేసింది. ఈ జాబితాలో సిగరెట్లు, కూల్ డ్రింక్స్, పొగాకు ఉత్పత్తుల వంటివి ఉన్నాయి. ఇలాంటి ఉత్పత్తులపై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని 35 శాతానికి పెంచాలని యోచిస్తుండటం గమనార్హం.
- ఇక స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ(GST Council Meeting) విధిస్తున్నారు. దాన్ని 5 శాతానికి తగ్గించాలని ఫిట్మెంట్ కమిటీ ప్రపోజ్ చేసింది. దీనిపైనా డిస్కషన్ నడుస్తోంది.
- ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 పన్ను శ్లాబులు ఉన్నాయి. కొత్తగా 35 శాతం శ్లాబ్ను తీసుకురావాలని కేంద్ర మంత్రుల బృందం ప్రపోజ్ చేసింది. హానికారక ఉత్పత్తులకు ఈ శ్లాబు రేటును వర్తింపజేయాలని సిఫార్సు చేసింది.