India Alert: 5 దేశాల్లో కరోనా విజృంభణ.. భారత్ అలర్ట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
చైనా, అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు.
- By hashtagu Published Date - 09:10 AM, Wed - 21 December 22
చైనా, అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు. జీనోమ్ సీక్వెన్సింగ్పై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా (Corona) కేసులు అంతగా లేవు, మరణాలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విస్తరిస్తున్నందున.. ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించాలంటే.. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహణ అవసరమని ఆయన చెప్పారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలను కూడా ఆదేశించారు. ఇదే అంశంపై ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా బుధవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను జాగ్రత్తగా ఉండాలని ఈ లేఖలో కోరింది. అయితే భయాందోళనలకు గురికావద్దని సలహా కూడా ఇచ్చింది.
భారతదేశంలో పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది?
చైనాలో కరోనా పరిస్థితి గురించి భారతదేశం ఆందోళన చెందాల్సినంతగా లేదని యాంటీ కరోనా టాస్క్ ఫోర్స్ సీనియర్ సభ్యుడు , కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రచార అధిపతి డాక్టర్ ఎన్కె అరోరా వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితిలో భారత్ ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉండటం మాత్రమే అవసరమన్నారు.
చైనా యొక్క అతిపెద్ద సవాల్ ఏమిటి?
ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో జీరో కోవిడ్ విధానాన్ని చైనా సడలించింది. ఫలితంగా ఇప్పుడు చైనాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రిలో రోగులకు పడక లేని పరిస్థితి నెలకొంది. మృతదేహాలకు అంత్యక్రియలు జరగడం లేదు. చాలా మంది రోగులకు అవసరమైన మందులు కూడా లభించడం లేదు. పెద్ద విషయం ఏమిటంటే, ఈ సమయంలో చైనాలోని చాలా మందికి కరోనాతో పోరాడే రోగనిరోధక శక్తి లేదు. జీరో కోవిడ్ విధానం కారణంగా వారు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఇలా రోగ నిరోధక శక్తి నశించడానికి కారణం.
Related News
New COVID Variant: కరోనా నుంచి మరో కొత్త రకం.. భారత్లో పెరుగుతున్న ఆందోళన
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది.