Union Budget 2024 : కేంద్ర బడ్జెట్లో వేతన జీవుల కోసం గుడ్ న్యూస్ !
కేంద్ర బడ్జెట్ను జులై 22న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు దేశంలోని వేతన జీవులు అందరి చూపు బడ్జెట్ వైపే ఉంది.
- By Pasha Published Date - 11:29 AM, Wed - 19 June 24

Union Budget 2024 : కేంద్ర బడ్జెట్ను జులై 22న ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు దేశంలోని వేతన జీవులు అందరి చూపు బడ్జెట్ వైపే ఉంది. తమకు ఊరటనిచ్చే గుడ్ న్యూస్ ఏదైనా బడ్జెట్ ప్రకటనలో వినిపిస్తుందా అనే ఆశతో ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. త్వరలో వెలువడే బడ్జెట్లో ఆదాయపు పన్ను శ్లాబ్లలో మార్పులు జరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతుండటం, ఆదాయాల్లో పెరుగుదల లేకపోవడం, నిత్యావసరాల ధరల మంటతో దేశ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో ఆదాయపు పన్ను శ్లాబ్లలో మార్పులు అవసరమని కేంద్రం భావిస్తోందట. మధ్యతరగతి కుటుంబాలలోని ఆదాయ వర్గాల వారికి సంబంధించిన పన్ను రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వారి జీవనశైలిని పెంపొందించి.. పొదుపు అలవాటును పెంచడమే లక్ష్యంగా బడ్జెట్ (Union Budget 2024) ప్రకటనలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈసారి కేంద్ర బడ్జెట్లో ముఖ్యంగా రూ.15 లక్షలకు పైగా ఆర్జిస్తున్న వారికి ఊరట లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి 5 నుంచి 20 శాతం మేర పన్ను పడుతుండగా.. రూ.15 లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30 శాతం ట్యాక్స్ పడుతోంది. ఈ పన్నురేట్లను తగ్గించే దిశగా నిర్ణయాలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రూ.10 లక్షల వార్షికాదాయంపైనా పన్ను రేట్లు తగ్గించాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల ప్రజల వినియోగం, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరిగి పొదుపులు, పెట్టుబడులు పెరుగుతాయని సర్కారు అంచనా వేస్తోంది. ఫలితంగా జీఎస్టీ వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.
Also Read : Kim – Putin : ఉత్తర కొరియాలో పుతిన్.. కిమ్తో భేటీ.. కీలక ఎజెండా !
ఈసారి కేంద్ర బడ్జెట్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను విస్తరించాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. వ్యవసాయ రంగంలోని సవాళ్లను పరిష్కరించడం, ఉపాధిని సృష్టించడం, రాబడి వృద్ధిని పెంచడం వంటి ప్రాథమిక విధానాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కేంద్రబడ్జెట్కు సంబంధించి శనివారం రోజు (జూన్ 22న) జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్లో మార్పులు ఉంటాయి అనే దానిపై ఆ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.