Operation Sindoor : మళ్లీ సైన్యంలో పాల్గొంటాం అంటున్న మాజీ సైనికులు
Operation Sindoor : కార్గిల్ యుద్ధ వెటరన్ కొమ్ము కోటేశ్, గడ్డకట్టే మంచులో పని చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సైన్యం పిలిస్తే మరల సేవ చేయడానికి వెనుకాడనని చెప్పారు.
- By Sudheer Published Date - 12:30 PM, Fri - 9 May 25

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన “ఆపరేషన్ సిందూర్” నేపథ్యంగా సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ, ఉగ్రవాద స్థావరాలను ఛేదిస్తున్న భారత సైన్యం, దేశ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుతోంది. ఈ పరిణామాల్లో దేశం పిలిస్తే మళ్లీ సైన్యంలో చేరేందుకు సిద్ధమంటూ పలువురు మాజీ సైనికులు ముందుకొస్తున్నారు.
ఉగ్రవాదానికి బలైన జవాన్ల పట్ల బాధను వ్యక్తపరిచిన భవాని, పాకిస్థాన్ చర్యలకు గట్టి బదులు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, అవసరమైతే మళ్లీ సేవలు అందించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు. ఇదే సమయంలో రాజేంద్ర కుమార్ పాక్పై గట్టి విమర్శలు చేస్తూ, భారత్ ముందు పాక్ నిలవలేదని, దేశ రక్షణలో భాగంగా బార్డర్లో పనిచేయడం గర్వకారణమని అన్నారు. పల్లా వెంకటేశ్వర్లు, మచ్చల్ సెక్టార్లో గాయపడినప్పటికీ, భారత్ సైన్యం చేస్తున్న దాడులు న్యాయమేనని అభిప్రాయపడ్డారు.
కార్గిల్ యుద్ధ వెటరన్ కొమ్ము కోటేశ్, గడ్డకట్టే మంచులో పని చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సైన్యం పిలిస్తే మరల సేవ చేయడానికి వెనుకాడనని చెప్పారు. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న పాపిరెడ్డి, అప్పటి రాజకీయ నిర్ణయాలు లేకపోతే పాకిస్థాన్ను అప్పుడే పూర్తిగా చితిమందుల చేసేవాళ్లమని అంటారు. ఈ మాటలు మనం బలమైన సైనిక శక్తిగా ఉన్నామనే గర్వాన్ని మాత్రమే కాకుండా, మాజీ సైనికుల దేశభక్తి ఎంత అగాధంగా ఉందో స్పష్టంగా చూపుతున్నాయి.