Arvind Kejriwal : కేజ్రీవాల్ విడుదలకు లా స్టూడెంట్ ‘పిల్’.. హైకోర్టు రూ.75వేల జరిమానా
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మధ్యంతర బెయిల్’ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
- Author : Pasha
Date : 22-04-2024 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
Arvind Kejriwal : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మధ్యంతర బెయిల్’ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పిల్ను దాఖలు చేసిన లా స్టూడెంట్కు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం రూ.75,000 జరిమానా కూడా విధించింది. పిల్లో పిటిషనర్ ప్రస్తావించిన అంశాలకు.. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉండేందుకు దారితీసిన అంశాలకు ఏమాత్రం పొంతన లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అందుకే ఈ పిటిషన్ చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join
‘‘భారత రాజ్యాంగంలోని సమానత్వ సూత్రం, చట్టబద్ధమైన పాలన ఎప్పుడూ ఉన్నతమైనవని మనం గుర్తుంచుకోవాలి. మనందరి కంటే చట్టం ఉన్నతమైంది. చట్టం ముందు అందరూ సమానులే. అత్యున్నత హోదాల్లో ఉన్నవారిపై కేసుల విచారణ పెండింగ్లో ఉన్న టైంలో వారికి ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మధ్యంతర బెయిల్’ను కోర్టు మంజూరు చేయలేదు’’ అని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ‘‘కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినా ఇబ్బంది ఉండదు. ఆయన ఎవరినీ ప్రభావితం చేయరు’’ అని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు తప్పుపట్టింది. కేజ్రీవాల్తో (Arvind Kejriwal) వ్యక్తిగత అనుబంధం ఉన్నట్టుగా పిటిషనర్ పక్షపాత పూరిత వాదన వినిపించడాన్ని ధర్మాసనం ఖండించింది.
Also Read :Supreme Court : 14 ఏళ్ల బాలిక అబార్షన్కు సుప్రీంకోర్టు అనుమతి
జైలులో కస్టడీలో ఉండగా గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా, అతీఖ్ అహ్మద్ల హత్యలు జరిగిన విషయాలను పిటిషన్లో సదరు లా స్టూడెంట్ ప్రస్తావించారు. తిహార్ జైలులో కేజ్రీవాల్ ప్రమాద వలయంలో ఉన్నారు అనే విధంగా పిటిషన్లో పేర్కొన్నారు. “వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా” పేరుతో లా నాలుగో సంవత్సరం విద్యార్థి ఈ పిల్ను దాఖలు చేశారు. తనకు ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేవనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ని వాడుకున్నానని చెప్పాడు. న్యాయవాది కరణ్పాల్ సింగ్ ద్వారా ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేయించారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేక చాలా మంది ఖైదీలు జైళ్లలో మరణించారని కూడా పిటిషన్లో తెలిపారు.