CM Atishi : కల్కాజీ నుంచి ఢిల్లీ సీఎం అతిషి నామినేషన్ దాఖలు
తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
- By Latha Suma Published Date - 04:34 PM, Tue - 14 January 25

CM Atishi : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోలాహలం నెలకొన్నది. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల కాగా. 17వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో నామినేషన్లు జోరందుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సింగ్ ఈరోజు కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
అతిషి వాస్తవానికి సోమవారం నామినేషన్ దాఖలు చేయాల్సింది. ఈ క్రమంలోనే ఆమె కల్కాజీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాతో కలిసి కల్కాజీలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లగా అప్పటికే సమయం మించిపోయింది. మధ్యాహ్నం 3 గంటలలోపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేకపోయారు.
దీంతో ఈరోజు ఉదయాన్నే ఆమె నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్ అతిషి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.