America – Ayodhya : అమెరికా రాజధానిలో అయోధ్య రామయ్య నామస్మరణతో ర్యాలీ
America - Ayodhya : అమెరికా రాజధాని వాషింగ్టన్లోనూ అయోధ్య రాముడి నామస్మరణ మార్మోగింది.
- Author : Pasha
Date : 17-12-2023 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
America – Ayodhya : అమెరికా రాజధాని వాషింగ్టన్లోనూ అయోధ్య రాముడి నామస్మరణ మార్మోగింది. జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఆ రోజున శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం(America – Ayodhya) అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా హిందూలోకం ఆనంద మహోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలైంది. తాజాగా వాషింగ్టన్ డీసీలో హిందూ సంఘం సభ్యులు కార్ ర్యాలీ నిర్వహించారు. ఫ్రెడరిక్ సిటీ సమీపంలోని అయోధ్య వేలో ఉన్న శ్రీ భక్త ఆంజనేయ ఆలయం దాకా కార్లలో ర్యాలీ చేశారు. అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ డీసీ చాప్టర్ అధ్యక్షుడు మహేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక తమిళ హిందూ నాయకుడు ప్రేమ్కుమార్ స్వామినాథన్ ఈ ర్యాలీకి సహ నిర్వాహకుడిగా వ్యవహరించారు. ఈసందర్భంగా తమిళ్లో శ్రీరాముడిని స్తుతిస్తూ ఆయన పాటలు పాడారు.
We’re now on WhatsApp. Click to Join.
ర్యాలీ అనంతరం శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో నిర్వహించిన సమావేశంలో విశ్వహిందూ పరిషత్ డీసీ చాప్టర్ అధ్యక్షుడు మహేంద్ర మాట్లాడుతూ.. అయోధ్యలో జరగబోయే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాలని అందరినీ ఆహ్వానించారు. రాబోయే హిందూ తరాలకు అయోధ్య రామమందిరం చారిత్రక ప్రారంభోత్సవాన్ని ఇవ్వబోతోందని తెలిపారు. ‘‘జనవరి 20న వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో దాదాపు వెయ్యి అమెరికన్ హిందూ కుటుంబాలతో ఒక వేడుకను నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలో రామ్ లీలా, శ్రీరాముని కథలు, ప్రార్థనలు, భజనలు, భక్తి గీతాల ఆలాపనలు జరుగుతాయి. ఈ కార్యక్రమం సందర్భంగా శ్రీరాముడి జీవితం గురించి అర్థమయ్యే రీతిలో దాదాపు 45 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇస్తారు’’ అని మహేంద్ర సాపా తెలిపారు.