BSNL Tariffs : బీఎస్ఎన్ఎల్ కొత్త లోగో.. 7 కొత్త సర్వీసులు.. టారిఫ్ ప్లాన్లపై గుడ్ న్యూస్
రాబోయే కొన్ని నెలలపాటు బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను(BSNL Tariffs) పెంచే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
- By Pasha Published Date - 04:21 PM, Tue - 22 October 24

BSNL Tariffs : భారత ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ కొంగొత్తగా ముందుకు సాగుతోంది. త్వరలో 5జీ సేవలు కూడా బీఎస్ఎన్ఎల్ అందించనుంది. ఈ తరుణంలో బీఎస్ఎన్ఎల్ లోగోను మార్చారు. కొత్త లోగోలో కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచారు. దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్ను డిస్ప్లే చేశారు. ఇంతకుముందు లోగోలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చిహ్నాలు ఉండేవి. కొత్త లోగోలోకి కాషాయ రంగు చేరడం గమనార్హం.
Also Read :Bogus Court : బోగస్ కోర్టు నడిపిన ఘరానా మోసగాడు.. ఇలా దొరికిపోయాడు
కంపెనీ లోగోను మార్చిన సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ రాబర్ట్ రవి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక వివరాలను వెల్లడించారు. రాబోయే కొన్ని నెలలపాటు బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను(BSNL Tariffs) పెంచే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. వినియోగదారుల సంతోషం కోసం రీఛార్జ్ టారిఫ్ ప్లాన్లను పెంచకూడదని నిర్ణయించామన్నారు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ ప్లాన్లను పెంచాయి. బీఎస్ఎన్ఎల్ మాత్రం వాటి పెంపు ప్రసక్తే లేదని వెల్లడించడం.. ఆ కంపెనీ యూజర్లకు పెద్ద శుభవార్తే.
Also Read :China Vs India : భారత్తో కలిసి పనిచేస్తామన్న చైనా.. ఆర్మీ చీఫ్ కీలక ప్రకటన
బీఎస్ఎన్ఎల్ 7 కొత్త సర్వీసులు
- బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడు కొత్త సర్వీసులను బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ రాబర్ట్ రవి, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రారంభించారు.
- వీటిలో మొదటి సర్వీసు ‘ఏనీ టైమ్ సిమ్ కియోస్క్లు’. ఇందులో భాగంగా సిమ్ విక్రయాలు, యాక్టివేషన్, కేవైసీ ఇంటిగ్రేషన్ కోసం ప్రత్యేక కేంద్రాలను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనుంది.
- రెండో సర్వీసు ‘డైరెక్ట్ టు డివైజ్’. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఎక్కడి నుంచైనా ఎస్ఎంఎస్లను పంపొచ్చు. ఇందుకోసం శాటిలైట్ కనెక్టివిటీ టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ వాడబోతోంది.
- మూడో సర్వీసు ‘స్పామ్ బ్లాకర్స్’. దీని ద్వారా స్పామ్ రహిత టెలికాం నెట్వర్క్ను యూజర్లకు అందించనుంది. మోసపూరిత ఎస్ఎంఎస్లు, ఫిషింగ్ కాల్స్ను బీఎస్ఎన్ఎల్ అడ్డుకోనుంది.
- నాలుగో సర్వీసు ‘వైఫై రోమింగ్’. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏ ఎఫ్టీటీహెచ్ వైఫైకైనా కనెక్ట్ కావచ్చు.
- ఐదో సర్వీసు ‘ఐఫ్టీవీ’. దీని ద్వారా ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ లైవ్ టీవీ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. తద్వారా ఎఫ్టీటీహెచ్ యూజర్లకు 500 దాకా ప్రీమియం ఛానళ్లు అందుతాయి.
- ఆరో సర్వీసు ‘పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్’. దీని ద్వారా రియల్ టైమ్ డిజాస్టర్ రెస్పాన్స్, కమ్యూనికేషన్, పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లతో యూజర్లకు నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది.
- ఏడో సర్వీసు ‘గనుల్లో ప్రయివేటు 5జీ’. దీని ద్వారా మైనింగ్ రంగంలోని కార్యకలాపాల కోసం 5జీ టెక్నాలజీ సేవలను బీఎస్ఎన్ఎల్ చౌకగా అందించనుంది.