Air India Plane Crash: ఇంటికి చేరిన సుమీత్ సబర్వాల్ మృతదేహం..
Air India Plane Crash: సాధారణంగా తండ్రి అంత్యక్రియలు (Funeral)కొడుకులు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా జరిగింది
- Author : Sudheer
Date : 17-06-2025 - 1:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash)లో మరణించిన కెప్టెన్ సుమీత్ సబర్వాల్ (Captain Sumit Sabharwal) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సాధారణంగా తండ్రి అంత్యక్రియలు (Funeral)కొడుకులు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా జరిగింది. వృద్ధ తండ్రి తన కుమారుడి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి సేవ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు హామీ ఇచ్చిన సుమీత్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆ తండ్రి మనసును పిండేస్తోంది. ముంబై పవాయిలోని జల్ వాయు విహార్ నివాసానికి చేరుకున్న సుమీత్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Bigger Indus Plan : సింధు జలాల వినియోగానికి కాల్వల తవ్వకం!
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే బీజే మెడికల్ హాస్టల్పై కుప్పకూలి దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో సుమీత్ సబర్వాల్ సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడడం గమనార్హం. విమానం లోపం గమనించిన సుమీత్ చివరిమనిట్లో “మేడే” సంకేతం పంపినప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయారు. ఆయనకు 8200 గంటల పైలట్ అనుభవం ఉన్నా.. ప్రమాదం అనివార్యంగా మారింది. ఇది విమానయాన రంగానికే పెద్ద విషాదం.
ఇకపోతే ఈ ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 135 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తవగా, 101 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి తెలిపారు. మిగిలిన మృతదేహాలకు కూడా త్వరలో పరీక్షలు పూర్తిచేసి అప్పగించనున్నట్టు వెల్లడించారు. మొత్తం మీద, కెప్టెన్ సుమీత్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు కాగా, వృద్ధ తండ్రి కన్నీరే ఈ విషాదాన్ని ప్రతిబింబిస్తుంది.