Tragedy : ప్రేమ పేరుతో సహజీవనం.. చివరకు గొంతు కోసిన ఘాతుకం..ఆపై దావత్!
Tragedy : భారతదేశంలో మహిళలపై హత్యలు, హింసాకాండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భోపాల్ నగరంలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
- Author : Kavya Krishna
Date : 01-07-2025 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
Tragedy : భారతదేశంలో మహిళలపై హత్యలు, హింసాకాండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భోపాల్ నగరంలో జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇటీవల బెంగళూరులో ప్రియురాలిని హత్య చేసి చెత్త ట్రక్కులో విసిరేసిన ఘటన మరువక ముందే, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మరో తలదన్నే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.
భోపాల్కు చెందిన సచిన్ రాజ్పుత్ (32), రితికా సేన్ (29) గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. వారు నగరంలోని ఒక అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. అయితే జూన్ 27న వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. కోపంతో ఆవేశానికి లోనైన సచిన్… రితికా గొంతు కోసి హత్య చేశాడు.
రితికాను హత్య చేసిన అనంతరం సచిన్ ఆమె మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి, తాడుతో బిగించి ఇంట్లోనే పడేయగా… అదే రాత్రి అతను ఒక స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నాడు. మద్యం మత్తులో సచిన్ తన స్నేహితుడికి రితికాను చంపిన విషయాన్ని తెలిపాడు. అయితే అది నిజమని మొదట నమ్మని స్నేహితుడు, మరుసటి రోజు సచిన్ ఇంటికి వెళ్లి పరిశీలించగా రితికా మృతదేహం దొరికింది.
స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో పోస్టుమార్టం కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. సోమవారం సాయంత్రం నిందితుడు సచిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఉన్న మానవత్వానికి అద్దం పడతాయా? అనే ప్రశ్నలతో దేశ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.
Costly Buffalo : రూ.14 లక్షలు పలికిన గేదె.. బన్నీ జాతి గేదెల స్పెషల్ స్టోరీ