Business Idea : అరటి పండే కాదు తొక్క, కాండం కూడా డబ్బులు సంపాదించి పెడుతుంది, ఈ బిజినెస్కు ప్రభుత్వం సబ్సిడి కూడా ఇస్తుంది.
- Author : hashtagu
Date : 02-04-2023 - 6:44 IST
Published By : Hashtagu Telugu Desk
వ్యాపారం (Business Idea) చేయాలన్న ఆలోచన ఉంటే..ఎన్నో మార్గాలు ఉన్నాయి. పనికిరాని వస్తువులు కూడా మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కావాల్సింది ఆలోచన. దేశంలో అనేక రాష్ట్రాల్లో అరటి సాగుతో రైతులు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతోపాటు ఇతర పంటలను కూడా సాగు చేస్తూ లాభాలబాట పడుతున్నారు. అయితే అరటి పండ్ల ద్వారానే కాకుండా వ్యర్థాల కూడా డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా. అరటి వ్యర్థాలతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంటుంది. తాడులు, బుట్టలు, చాపలు, సంచులు ఇలా ఎన్నో ఉత్పత్తులు తయారు చేయవచ్చు. కాండం, ఆకులు, బెరడు నుంచి కూడా తయారు చేయవచ్చు. ఈ ఉత్పత్తులను తయారు చేసేందుకు రైతులు ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది.
అరటి కాండం నుంచి తాడులు తయారు చేయవచ్చు. యంత్రం సాయంతో అరటి కాండం రెండు భాగాలుగా కత్తిరించి…సన్నని ముక్కలుగా చేసి ప్రాసెసింగ్ యూనిట్ సాయంతో తాడులను తయారు చేయవచ్చు. అరటి కాండం నుంచి తయారైన ఫైబర్ తో చాపలు, రగ్గులు, హ్యాండ్ బ్యాగులతోపాటు కాగితం కూడా తయారు చేస్తారు. అరటి కాండం నుంచి తయారు చేసిన ఉత్పత్తుల నాణ్యత బాగుంటుంది. అరటి మొక్కల్లో అనేక రకాల తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది రైతులు మొక్క కాండానికి సంబంధించిన అవశేషాలను పొలంలోనే వదిలేస్తారు. అవి కొన్నాళ్లకు మట్టిలో కలిసిపోతాయి. ఇది రాబోయే పంటపై వ్యాధులు, తెగుళ్లు వంటి అవకాశాలను పెంచుతుంది.
ఇక అరటికాడంలో ఐరన్, పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో ద్రవరూప ఎరువులను కూడా తయారు చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఎరువులు మొక్కకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు అరటి చిప్స్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మైక్రో ఫుడ్ ఇండస్ట్రీ అప్ గ్రేడేషన్ స్కిం కింద దీనికి సంబందించిన ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడి కూడా ఇస్తుంది.