Shock To Chirag : చిరాగ్ పాశ్వాన్కు షాక్.. 22 మంది ‘ఇండియా’ కూటమిలోకి!
Shock To Chirag : బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 10:00 AM, Thu - 4 April 24

Shock To Chirag : బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్కు 22 మంది కీలక నేతలు షాక్ ఇచ్చారు.లోక్ సభ టికెట్లు దక్కలేదనే నిరాశతో వారంతా పార్టీకి రాజీనామా ప్రకటించారు. రాజీనామా చేసిన 22 మంది నేతలంతా ఇండియా కూటమికి మద్దతు ఇస్తారని సీనియర్ నేత సతీశ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్న ఈ టైంలో చిరాగ్ పాశ్వాన్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆయన ఫైర్ అయ్యారు. బిహార్ ప్రజలకు చిరాగ్ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఇక రాజీనామా చేసిన మిగతా నేతలు కూడా చిరాగ్పై నిప్పులు చెరుగుతున్నారు. చిరాగ్ పాశ్వాన్ అన్ని లోక్సభ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘బయటి వ్యక్తులకు టికెట్లు ఎందుకిచ్చారు ? పార్టీలో సమర్థవంతులు లేరా?’’ అని చిరాగ్ను ఎల్జేపీ మాజీ ఎంపీ రేణు కుష్వాహ ప్రశ్నించారు. పార్టీలో కూలీలుగా పని చేయడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ టికెట్లు కేటాయించే సమయంలో పార్టీ సీనియర్ నేతలతో చిరాగ్ కనీసం సంప్రదింపులు జరపలేదన్నారు. ఇక లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీకి రిజైన్ చేసిన వారిలో మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రవీంద్ర సింగ్, అజయ్ కుష్వాహ, సంజయ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ డాంగి తదితరులు ఉన్నారు. ప్రస్తుతం చిరాగ్ పాశ్వాన్(Shock To Chirag) పార్టీ బిహార్లోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది.
Also Read : Rahul Gandhis Assets : రాహుల్ గాంధీకి ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా ?
బిహార్ రాష్ట్రంలో బీజేపీ 17 స్థానాల్లో, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 16, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) ఒక్కో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి సెగ్మెంట్లను ఎల్జేపీకి కేటాయించారు. సమస్తీ పూర్ నుంచి శాంబవి చౌదరి, ఖగారియా నుంచి రాజేశ్ వర్మ, వైశాలిలో వీణాదేవిలను ఎల్జేపీ అభ్యర్థులుగా చిరాగ్ ప్రకటించినందు వల్లే పార్టీ నేతలు తిరగబడ్డారని తెలుస్తోంది. ఇక చిరాగ్ పాశ్వాన్ బిహార్లోని కీలకమైన హజీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.