Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం
ఈ సింధూరం చీరలు ప్రధాని మోడీకి, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతను తెలుపుతాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కృష్ణ గౌర్(Sindoor Sarees) వెల్లడించారు.
- By Pasha Published Date - 01:29 PM, Thu - 29 May 25

Sindoor Sarees : 15వేల మంది మహిళలు సిందూరం రంగు చీరల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. మే 31న మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సేనలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 18వ శతాబ్దానికి చెందిన మాల్వా పాలకురాలు లోక్ మాతా అహల్యాబాయి 300వ జయంతిని పురస్కరించుకొని భోపాల్లో నిర్వహించే మహిళా సదస్సులో మోడీ పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం బీజేపీ మహిళా విభాగం మధ్యప్రదేశ్లోని 1,300 మండలాల నుంచి 15,000 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వారంతా సింధూరం రంగు చీరల్లో ప్రధానికి స్వాగతం పలుకుతారు.
ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళా అధికారులకే
ఈ సింధూరం చీరలు ప్రధాని మోడీకి, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతను తెలుపుతాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కృష్ణ గౌర్(Sindoor Sarees) వెల్లడించారు. ఈకార్యక్రమంలో పాల్గొనే మహిళా వలంటీర్లకు సిందూరం రంగు చీరలను బీజేపీయే పంపిణీ చేస్తోంది. మోడీ పర్యటన ఉన్నందున భోపాల్లోని హెలిప్యాడ్, వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ నిర్వహణను పూర్తిగా మహిళా అధికారులు చూసుకుంటారు. ఐపీఎస్ సోనాలి మిశ్రా భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.తొలిసారిగా 47 మంది మహిళా అధికారులు వీఐపీ భద్రతకు నాయకత్వం వహిస్తారు.
Also Read :Fish Prasadam : జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. మృగశిర కార్తె రోజే తినాలా ?
టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమయ్యాం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి సరైన సమాధానమని ఈరోజు ప్రధాని మోడీ పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రమూకలు చేసింది మానవత్వంపై దాడి అని తెలిపారు. ఇప్పుడు మనం టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమయ్యామని చెప్పారు. ‘‘నేను గ్యాంగ్టక్లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొందామని అనుకున్నాను. కానీ, వాతావరణం అందుకు సహకరించలేదు. సాహస క్రీడలకు హబ్గా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయి. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలి’’ అని మోడీ కామెంట్ చేశారు. ఈరోజు సిక్కిం రాష్ట్ర హోదా పొంది 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా ఆయన ప్రసంగించారు.