Karnataka Agriculture Department : సంక్షోభంలో కర్ణాటక వ్యవసాయ శాఖ…?
- By Prasad Published Date - 08:14 AM, Mon - 6 June 22
కర్ణాటకలో రుతుపవనాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేయడంతో రైతులు సంతోషిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం చాలా మంది రైతులకి షాక్ని కలిగిస్తుంది. 50 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నందున ఈ శాఖ తీవ్ర సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఇది డిపార్ట్మెంట్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
వివిధ కేడర్ల నుంచి శాఖకు మంజూరైన సిబ్బంది సంఖ్య 9,007 కాగా.. అందులో 4,020 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 44 శాతం మంది సిబ్బంది మాత్రమే ఈ విభాగంలో పనిచేస్తున్నారు. వాటిలో గ్రూప్ B, గ్రూప్ C ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. అయితే చాలా ఖాళీలు ఈ రెండు కేడర్ల నుండి ఉన్నాయి. గ్రూప్ బి క్యాడర్లో 4,091 మంజూరైన పోస్టుల్లో 1,781 మాత్రమే భర్తీ చేయబడ్డాయి. 300 మందిని రిక్రూట్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వాస్తవంగా అవసరమైన సిబ్బంది కంటే ఇది చాలా తక్కువ అని విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో దాదాపు 750 రైతు సంపర్క కేంద్రాలు (RSK), హోబ్లీ స్థాయిలో కనీసం ఒక్కొక్కటి ఉన్నాయి. ప్రతి ఆర్ఎస్కేలో ఒక అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉండాలి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన తొలి బడ్జెట్ ప్రసంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.33,700 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించి రైతు శక్తి పథకాన్ని కూడా ప్రకటించారు. చిన్నకారు రైతులకు ఎకరాకు రూ.250 డీజిల్ సబ్సిడీని కూడా సీఎం మంజూరు చేశారు.
పెద్ద సంఖ్యలో రైతులు, వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చే అనేక వ్యవసాయ సంబంధిత పథకాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఎరువుల రాయితీలు అందించడంతోపాటు గ్రామాల్లో లబ్ధిదారులకు చేరువ చేయడంలో గ్రౌండ్ లెవెల్లోని ప్రభుత్వ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. సిబ్బంది కొరతతో తాము వీటిని అందించలేకపోతున్నామని వాపోయారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి డిప్లొమా పూర్తి చేసిన 3 వేల మందిని అగ్రికల్చర్ అసిస్టెంట్లుగా, రెండు పంచాయతీలకు ఒకరిని నియమించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదన పంపగా, ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే కారణంతో ఆర్థిక శాఖ ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కింది.
Related News
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.