IRCTC Offer : రూ.13వేలకే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన యాత్ర
IRCTC Offer : ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని భావిస్తున్నారా ? అయితే ఇది మంచి అవకాశం. కేవలం రూ.13వేలకే టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ఆఫర్ చేస్తోంది.
- By Pasha Published Date - 02:00 PM, Sat - 28 October 23

IRCTC Offer : ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని భావిస్తున్నారా ? అయితే ఇది మంచి అవకాశం. కేవలం రూ.13వేలకే టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా మధ్యప్రదేశ్లోని రెండు జ్యోతిర్లింగాలను(ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వర ఆలయం) భక్తులు దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ పేరు ‘‘మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్’’. దీనికి సంబంధించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు (ట్రైన్ నెం.12707) కాచిగూడ నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరుతుంది. కాజీపేట జంక్షన్లోనూ ఈ ట్రైను ఆగుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. కాచిగూడ నుంచి బయలుదేరిన రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్కు ట్రైన్ చేరుతుంది. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్కు తీసుకెళ్తారు. రెండో రోజు రాత్రి భోపాల్లో, మూడో రోజు రాత్రి ఉజ్జయినిలో, నాలుగో రోజు రాత్రి ఇండోర్లో యాత్రికుల బసకు ఏర్పాట్లు చేస్తారు. ఐదోరోజు రాత్రి 8 గంటలకు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు (ట్రైన్ నెం: 19301)లో కాచిగూడకు బయల్దేరుతారు. ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
నవంబర్ 1 నుంచి..
ఈ యాత్రకు సంబంధించిన టికెట్లను నవంబర్ 1 నుంచి బుక్ చేసుకోవచ్చు. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్/ ఇందౌర్లో రాత్రి బస, ఉదయం అల్పాహారం అనేవి ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మిగిలిన రోజుల్లో టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాల బాధ్యత యాత్రికులదే. రైలు ప్రయాణంలో ఆహారాన్ని మీరే ఏర్పాటు చేసుకోవాలి. ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి. గైడ్ సదుపాయం ఉండదు.
ప్యాకేజీలు ఇలా..
- ‘‘మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్’’కు సంబంధించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని స్టాండర్ట్ స్లీపర్ బెర్త్ డబుల్ షేరింగ్ ప్యాకేజీ రూ. 16,360, ట్రిపుల్ షేరింగ్ ప్యాకేజీ రూ.13,530 ఉంటుంది. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య పిల్లలకు బెడ్తో సహా ప్యాకేజీ రూ.9,900, బెడ్ లేకుండా ప్యాకేజీ రూ.8,010 ఉంటుంది.
- నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే వేరే ప్యాకేజీ ఉంటుంది.
- థర్డ్ ఏసీ డబుల్ షేరింగ్ ప్యాకేజీ రూ.18,850, ట్రిపుల్ షేరింగ్ ప్యాకేజీ రూ.16,020 ఉంటుంది. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు బెడ్తో సహా ప్యాకేజీ రూ. 12,390, బెడ్ లేకుండా ప్యాకేజీ రూ.10,500 ఉంటుంది.
- స్టాండర్ట్ స్లీపర్ బెర్త్తో పాటు రూమ్ సింగిల్ షేరింగ్ ప్యాకేజీ రూ.35,320, ట్విన్ షేరింగ్ ప్యాకేజీ రూ.18,660, ట్రిపుల్ షేరింగ్ ప్యాకేజీ రూ.13,900 ఉంటుంది. ఇదే కేటగిరిలో ఐదు నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్తో సహా ప్యాకేజీ రూ.9,900,బెడ్ లేకుండా ప్యాకేజీ రూ. 8,010 ఉంటుంది.
- ఒకరు మొదలుకొని ముగ్గురి దాకా వ్యక్తులు కలిసి బుక్ చేసుకుంటే.. కంఫర్ట్ థర్డ్ ఏసీ బెర్త్లో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్ రూమ్ ప్యాకేజీ రూ.37,810, ట్విన్ షేరింగ్ ప్యాకేజీ రూ.21,150, ట్రిపుల్ షేరింగ్ ప్యాకేజీ రూ.16,390 ఉంటుంది. ఐదు నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు బెడ్తో పాటు ప్యాకేజీ రూ.12,390, బెడ్ లేకుండా ప్యాకేజీ రూ.10,500 ఉంటుంది.