Karthika Snanam: కార్తీకమాసం 30 రోజులు తలస్నానం చేసి పూజ చేయాలా? నియమం పాటించకపోతే!
Karthika Snanam: కార్తీకమాసంలో 30 రోజుల పాటు తలస్నానం చేయాలా, అలా చేయకపోతే ఏం జరుగుతుంది? ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Thu - 30 October 25
Karthika Snanam: కార్తీకమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కార్తీక స్నానాలు కార్తీక దీపాలు. కొంతమంది ఈ నెలలో 30 రోజులపాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే చల్లనీటితో నది స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. కార్తీకం నెల రోజులు నియమాలు పాటించాలనుకునేవారు తలస్నానంతో మొదలు పెడతారు. రోజూ తెల్లవారు జామున నిద్రలేచి నదులు, చెరువులు, బావులు వద్ద స్నానం ఆచరించి ఆ ఒడ్డున దీపం వెలిగించి హరిహరులను ప్రార్థిస్తూ ఉంటారు.
అయితే ఆరోగ్యంతో ఉన్నవారి సంగతి పక్కన పెడితే అనారోగ్యంతో ఉన్నవారి సంగతి ఏంటి? అంటూ కొంతమందికి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారు. వ్రతం, పూజ, నోము, ఉపవాసం ఏదైనా కానీ భగవంతుడికి భక్తుడిని మరింత దగ్గర చేయడంలో భాగమే. అందుకే ఇలా చేస్తేనే భగవంతుడు కరుణిస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తి ప్రదర్శించే విషయంలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలాగా ఉంటుందట. మనం భక్తి శ్రద్ధలతో చేసే పనిలోనే భగవంతుడు ఉన్నాడు. మనం పాటించే నియమాల్లో కాదని తెలుసుకోవాలని చెబుతున్నారు ఆధ్యాత్మిక పండితులు.
కార్తీకమాసం అంటేనే నెల రోజుల పాటూ చన్నీటి స్నానాలు దీపాలు, పూజలు ఆలయాల్లో భక్తుల సందడి. ఇల్లు, ఆలయం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది. అయితే దీపధూపాలకు ముందు ఆచరించే చన్నీటి స్నానం దగ్గరే కొందరికి సమస్య వస్తుందట. ఆరోగ్యం సహకరించదట. అయినప్పటికీ అమ్మో చన్నీళ్లతో తలకు స్నానం ఆచరించకపోతే ఏమవుతుందో అనే భయంతో నియమాలను అనుసరించేస్తారు. ఫలితంగా అనారోగ్యం పాలవుతారు. సూర్యోదయం కన్నా ముందు వణికించే చలిలో తలకు చన్నీటిస్నానం చేయమని ఎందుకు చెప్పారంటే అప్పటివరకూ బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే ఈ చన్నీటి స్నానాలతో బయటపడతాయి. తాము ఆరోగ్యంగా ఉన్నాం అనుకునేవారికి ఈ నెల రోజులు ఒక పరీక్ష అని చెబుతున్నారు. నిజంగా ఆరోగ్యంగా ఉండే ఈ నెలరోజుల చన్నీటి తలస్నానంతో ఏమీ కాదట. అనారోగ్యం ఏదైనా లోపల ఉంటే అది బయటపడుతుందని, అందుకే అప్పటికే అనారోగ్యంతో ఉండేవారు ఈ పరీక్షలో పాల్గొనాల్సిన అవసరం లేదని, కేవలం సాధారణ స్నానం ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తీకదీపం వెలిగించి శ్రీహరిని, శివుడుని పూజిస్తే చాలు అని చెబుతున్నారు. సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం ఒంటికి పట్టిన బద్ధకాన్ని వదిలించేస్తుందట. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు.