Coconut Lamp: ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ మాసంలో నారికేళ దీపాన్ని వెలిగించాల్సిందే!
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కార్తీక మాసంలో తప్పనిసరిగా నారికేళ దీపాన్ని వెలిగించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:32 PM, Thu - 7 November 24

తెలుగు మాసాలలో కార్తీక మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మాసంలో చేసే పూజల వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. ఈ మాసంలో నది స్నానాలు కార్తీకదీపాలు, దీప దానాలు, దీపారాధన ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కార్తిక మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ నారికేళ దీపం ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? అన్న విషయానికి వస్తే..
పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నారికేళ దీపాన్ని కార్తీకమాసంలో ఏ రోజైనా సరే ప్రదోషకాలంలో అంటే సాయంకాలం సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించాలట. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఈ దీపాన్ని వెలిగిస్తే మరీ మరీ మంచిదని చెబుతున్నారు. ఎలా వెలిగించాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత ఆ పరమేశ్వరుడు చిత్రపటం లేదా లింగ స్వరూపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించాలి. తర్వాత శివుడి పటం ముందు పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లెంను ఉంచాలి. ఆ పల్లెనికి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత చిన్న ప్లేట్ లోకి గంధం తీసుకోవాలి.
అందులోకి గంగాజలం లేదా మంచినీటిని పోసి కలపాలి. ఆ తడి గంధంలో ఉంగరపు వేలు ముంచి పళ్లెంలో స్వస్తిక్ గుర్తు రాయాలి. ఆ స్వస్తిక్ గుర్తుకు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని కుప్పలాగా పోసుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని పసుపు నీళ్లతో శుభ్రం చేసి దానిని పగలగొట్టాలి. అనంతరం ఆ రెండు కొబ్బరి చెక్కలను పళ్లెంలోని బియ్యం మీద ఉంచాలి. అందులో ఒక కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేయాలి. అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి. ఈ మూడు వత్తులను కొబ్బరి చిప్పలో తూర్పువైపు ఒక వత్తి, ఉత్తరం వైపు రెండోది, ఈశాన్యం వైపు మూడో వత్తి ఉంచాలి.
అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అగరబత్తీతో వెలిగిస్తూ “దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ” అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలో తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేళ దీపం, మరో కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పుష్పాలు అలకరించాలి. అక్షతలు వేయాలి. దీపానికి హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోయి ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు.