Kalasham: శుభకార్యాల్లో కలశాన్ని ఎందుకు వినియోగిస్తారో తెలుసా?
కలశం.. ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో పెళ్లిళ్లలో, గృహప్రవేశాలు జరిగినప్పుడు, ఇంట్లో వారం పూజ జరిగినప్పుడు కలశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. నీ
- By Anshu Published Date - 05:15 PM, Sun - 4 June 23

కలశం.. ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో పెళ్లిళ్లలో, గృహప్రవేశాలు జరిగినప్పుడు, ఇంట్లో వారం పూజ జరిగినప్పుడు కలశాన్ని ఏర్పాటు చేస్తుంటారు. నీటితో నిండిన ఇత్తడి లేదా రాగి పాత్రకు పసుపు రాసి బొట్టు పెట్టి, తెలుగు లేదా ఎరుపు రంగు దారం చుట్టి ఆ పాత్రలో నీళ్లు నింపితే అది కలశ అవుతుంది. ఆ తర్వాత దానిపై మామిడి ఆకులు, కొబ్బరి కాయ, నూతన వస్త్రం ఉంచుతారు. కొందరు కలశలో బియ్యం కూడా వేస్తారు. అదే కలశ, అదే పూర్ణకుంభం అని కూడా అంటారు.
ఆలయాలకు కొందరు ప్రముఖులు వచ్చినప్పుడు పూర్ణకుంభంలో స్వాగతం పలుకుతూ ఉంటారు. అయితే కలశాన్ని ఎందుకు పూజిస్తారు? అన్న విషయానికి వస్తే.. కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రతీకగా చెబుతారు. ఇది అన్నింటికీ జీవన దాత. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక కలశ చుట్టూ చుట్టిన దారం సృష్టిలో అన్నింటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది. అన్ని పుణ్య నదుల్లో నీరు, అన్ని వేదాల్లో జ్ఞానంతో పాటూ దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించిన తర్వాత అందులోని నీరుఅన్ని వైదికక్రియలకి వినియోగిస్తారు.
అలాగే కలశం ముఖభాగంలో విష్ణుమూర్తి, కంఠంలో నీలకంఠుడు అంటే పరమ శివుడు, మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగంలో మాత్రుకలు, కలశం గర్భంలో అంటే కలశంలోని జలంలో సమస్త సముద్రాలు, ఏడు ద్వీపాలతో కూడిన భూమి, నాలుగు వేదాలు, సకల దేవతలు కొలువై ఉంటారని అర్థం. అందుకే కలశలో నీటితో సంప్రోక్షణ చేస్తారు. కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా, వారిపట్ల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నామని అర్థం.