Amarnath Yatra: మళ్లీ ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర
పటిష్టమైన భద్రత మధ్య మరో 3 వేలమంది అమర్ నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు.
- Author : Balu J
Date : 25-07-2023 - 3:31 IST
Published By : Hashtagu Telugu Desk
పటిష్టమైన భద్రత మధ్య మరో 3 వేలమంది అమర్ నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో యాత్రను తిరిగి ప్రారంభించామని అధికారులు తెలిపారు. బాల్తాల్ బేస్ క్యాంపు నుంచి 38 వాహనాల్లో 11 వందల 60 మంది యాత్రికులు బయలుదేరగా…. పహల్గామ్ నుంచి 18 వందల 65 మంది 81 వాహనాల్లో బయలుదేరారని వివరించారు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్రలో ఇంతవరకు 3 లక్షల 30 వేల మంది అమర్ నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.
అమర్నాథ్కు వెళ్లే బట్కల్, పహల్గామ్ దారులతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు పేరుకొని ఉండటంతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దానిని తొలగించే పనిలో పడింది. మరోవైపు యాత్రకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడంచెల భద్రతతో పాటు మార్గమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
గత ఏడాది 3.45 లక్షల మంది భక్తులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఈసారి ఆ సంఖ్య 6 లక్షలకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతేడాది ఆకస్మిక వరదల కారణంగా 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: CM KCR: బీసీ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. 10వేల మందికి ఉచితంగా ఫీజు!