Muttiah Muralitharan: వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
ఈ నెల 25న హైదరాబాద్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకకు వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
- By Balu J Published Date - 03:36 PM, Fri - 22 September 23

Muttiah Muralitharan: లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘800’. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి నిర్మించారు. ఈ సినిమా ఆలిండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.
ఆయన సమర్పణలో సినిమా విడుదలవుతోంది. ఈ నెల 25న (సోమవారం) హైదరాబాద్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకకు వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”మైదానంలో ఇండియా తరఫున లక్ష్మణ్, శ్రీలంక తరఫున మురళీధరన్ పోటీ పడ్డారు. అయితే, మైదానం వెలుపల ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ స్నేహంతో మా ఈవెంట్ కి లక్ష్మణ్ వస్తున్నారు. ఆయనకు థాంక్స్. భారతీయులు సైతం అభిమానించే క్రికెటర్లలో ముత్తయ్య మురళీధరన్ ఒకరు.
ముంబైలో జరిగిన ట్రైలర్ ఆవిష్కరణలో ఆయనపై సచిన్ సహా ఇతరులకు ఎంత అభిమానం ఉందో చూశాం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చింది. సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. క్రికెట్ మాత్రమే కాకుండా మురళీధరన్ జీవితంలో జరిగిన అంశాలు, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది” అని అన్నారు.