Jr NTR : ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది – వి వి వినాయక్
ఎన్టీఆర్ వద్దకు ఏ కథ వచ్చినా ముందుగా వీరిద్దరూ వినేవారని, తారక్ భవిష్యత్తుపై వారికి అంతటి శ్రద్ధ ఉండేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మొదట్లో ప్రేమకథలు చేస్తున్న తరుణంలో, ఆయనకు ఒక పక్కా మాస్ హిట్ అవసరమని భావించిన కొడాలి నాని.. కేవలం రెండు రోజుల్లోనే
- Author : Sudheer
Date : 25-03-2026 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఆయనను ఒక మాస్ హీరోగా నిలబెట్టడంలో కొడాలి నాని, వల్లభనేని వంశీలు కీలక పాత్ర పోషించారని వి.వి. వినాయక్ వెల్లడించారు. ఎన్టీఆర్ వద్దకు ఏ కథ వచ్చినా ముందుగా వీరిద్దరూ వినేవారని, తారక్ భవిష్యత్తుపై వారికి అంతటి శ్రద్ధ ఉండేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మొదట్లో ప్రేమకథలు చేస్తున్న తరుణంలో, ఆయనకు ఒక పక్కా మాస్ హిట్ అవసరమని భావించిన కొడాలి నాని.. కేవలం రెండు రోజుల్లోనే వినాయక్ చేత ‘ఆది’ వంటి పవర్ ఫుల్ కథను సిద్ధం చేయించారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ టాలెంట్ మీద నమ్మకంతో పాటు ఆయనను అగ్రస్థానంలో చూడాలనే నాని పట్టుదలే ‘ఆది’ వంటి బ్లాక్ బస్టర్ రూపొందడానికి కారణమైందని వినాయక్ వివరించారు.
అలాగే వినాయక్ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అప్పట్లో తిరుగులేని నాయకుడిగా ఉన్న పరిటాల రవి.. ఎన్టీఆర్తో ఒక సినిమా నిర్మిస్తానని అడిగారట. అయితే, ఎన్టీఆర్ కెరీర్ను దృష్టిలో ఉంచుకుని కొడాలి నాని ఆ ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిరస్కరించినట్లు వినాయక్ తెలిపారు. పరిటాల రవి వంటి పెద్దాయన అడిగితే వద్దనడం ఏంటని తాను అడిగినా.. “నచ్చితే చేస్తారు, లేదంటే లేదు.. మాకు ఎన్టీఆర్ కెరీర్ ముఖ్యం” అని నాని చాలా మొండిగా సమాధానమిచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ కూడా నాని మాటపై నమ్మకంతో ఆ భారీ ప్రాజెక్టును కాదనుకున్నారని, అప్పట్లో వారి మధ్య ఉన్న స్నేహం మరియు పరస్పర విశ్వాసం అంతటి గాఢమైనదని వినాయక్ స్పష్టం చేశారు.
సినిమా స్థాయి మారాలి.. లేదంటే మూసుకోవాలి
ప్రస్తుత సినిమా ట్రెండ్ మరియు తన గ్యాప్ గురించి వినాయక్ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా స్థాయికి వెళ్లారని, ఆ స్థాయిని అందుకునే కంటెంట్ ఉంటేనే సినిమాలు తీయాలని, లేదంటే ఊరికే రొటీన్ సినిమాలు తీసి ఉన్న పేరు పోగొట్టుకోకూడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం డైరెక్టర్లు హీరోల చుట్టూ భజన చేస్తూ బానిసల్లా మారుతున్నారనే విమర్శలపై స్పందిస్తూ.. కంటెంట్ ముఖ్యం కానీ వ్యక్తిగత భజన కాదని పరోక్షంగా చురకలు అంటించారు. ‘అదుర్స్ 2’ గురించి ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని, బాధ్యత పెరిగినప్పుడు భయం సహజమని, సరైన కథ దొరికినప్పుడే మళ్లీ మెగా ఫోన్ పడతానని వినాయక్ తన మనసులోని మాటను బయటపెట్టారు.