Stampede at Sandhya Theatre : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. థియేటర్ యజమాని అరెస్ట్
Stampede : 'థియేటర్ యాజమాన్యంలో 8 మంది పార్ట్నర్స్ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఘటనకు బాధ్యులే. లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇంఛార్జీ విజయ్ చందర్, సీనియర్ మేనేజర్ నాగరాజును అరెస్ట్ చేశాం. వారిని చంచల్ గూడ జైలుకు తరలించాం.
- Author : Sudheer
Date : 08-12-2024 - 9:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఆర్టీసీ క్రాస్ రోడ్లలోని సంధ్య థియేటర్ ( Sandhya Theatre) వద్ద ‘పుష్ప-2’ ప్రీమియర్ (‘Pushpa-2’ Premiere Show)) సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఒక మహిళ (Woman Dies)మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హడావుడి కారణంగా తగిన భద్రతా చర్యలు చేపట్టలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. థియేటర్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. థియేటర్ వద్ద భద్రతా చర్యల విఫలమవ్వడం , పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనలో ‘పుష్ప-2’ చిత్ర నటుడు అల్లు అర్జున్ మరియు చిత్ర బృందంపై కూడా కేసులు నమోదయ్యాయి. ప్రీమియర్ సందర్భంగా ఏర్పాట్లలో ఖచ్చితత్వం లేకపోవడం, ప్రేక్షకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకోకుండా టికెట్లు విక్రయించడం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు ముందస్తుగా చేపట్టలేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అరెస్టైన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
సంధ్య థియేటర్కు సంబంధించిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. ‘థియేటర్ యాజమాన్యంలో 8 మంది పార్ట్నర్స్ ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ ఘటనకు బాధ్యులే. లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇంఛార్జీ విజయ్ చందర్, సీనియర్ మేనేజర్ నాగరాజును అరెస్ట్ చేశాం. వారిని చంచల్ గూడ జైలుకు తరలించాం. బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ పరిస్థితి ఆశాజనకంగా ఉంది. భగవంతుడి దయతో బాలుడు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.’ అని ఏసీపీ పేర్కొన్నారు.
Read Also : Sonia Gandhi : సోనియా గాంధీపై బీజేపీ సంచలనం.. కశ్మీర్ను స్వతంత్ర దేశంగా..