Mohanlal : మాలీవుడ్ను నాశనం చేయొద్దు.. వాళ్లకు శిక్ష తప్పదు: మోహన్ లాల్
అన్ని ప్రశ్నలకు ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని మోహన్ లాల్ స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 04:38 PM, Sat - 31 August 24

Mohanlal : జస్టిస్ హేమ కమిటీ నివేదికపై నటుడు మోహన్ లాల్ స్పందించారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దాన్ని విడుదల చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించడం సరైనదే అని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రశ్నలకు ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) సమాధానం ఇవ్వడం సాధ్యం కాదని మోహన్ లాల్ స్పష్టం చేశారు. దయచేసి మలయాళం సినీ పరిశ్రమను నాశనం చేయకండని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష తప్పదన్నారు.మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు. రాజీనామా చేశాక తొలిసారిగా హేమ కమిటీ నివేదికపై స్పందిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మాలీవుడ్లో పవర్ గ్రూప్ గురించి తనకు తెలియదని, తాను అందులో భాగం కాదని స్పష్టం చేశారు.ఇవాళ తిరువనంతరపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ లాల్(Mohanlal) ఈవివరాలను వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘మలయాళ చిత్ర పరిశ్రమ చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. ఇది పెద్ద ఇండస్ట్రీ. ఇందులో వేలాది మంది ఉన్నారు. అందరినీ నిందించలేం. జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిశీలిస్తున్నాం. విచారణ ప్రక్రియకు సహకరిస్తాం’’ అని మోహన్ లాల్ తెలిపారు. ‘‘మాలీవుడ్లో మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. దోషులకు శిక్ష తప్పదు. దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి’’ అని ఆయన పిలుపునిచ్చారు. ‘అమ్మ’కు మోహన్ లాల్ రాజీనామా తర్వాత చాలా మంది అమ్మపై విమర్శలు చేశారు. కొందరు మోహన్ లాల్పైనా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ తాజాగా ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. హేమ కమిటీ నివేదికపై తన అభిప్రాయాలను విలేకరుల సమావేశంలో స్పష్టంగా విడమర్చి చెప్పారు. కొంతమంది తనపై చేసిన ఆరోపణలకు కూడా వివరణ ఇచ్చారు. మాలీవుడ్ ప్రతిష్ఠను కాపాడేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.