Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధరకు రెక్కలు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!
- By Vamsi Chowdary Korata Published Date - 04:10 PM, Thu - 30 October 25
సావరిన్ గోల్డ్ బాండ్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇష్యూ చేసిన బాండ్లకు సంబంధించి.. ఇప్పుడు రిడెంప్షన్ ధరల్ని ప్రకటిస్తుండగా.. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు 2017-18 సిరీస్ V గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధరల్ని ప్రకటించింది. ఇక్కడ 300 శాతానికిపైగా రిటర్న్స్ అందుకున్నారు. ఇష్యూ ధర, రిడెంప్షన్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం.. బంగారంపై పెట్టుబడుల కోసం గతంలో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (సార్వభౌమ గోల్డ్ బాండ్ పథకం) తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ కనీసం గ్రాము నుంచి కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గ్రామును యూనిట్గా పేర్కొంటారు. ఇక్కడ మన దగ్గర బంగారం ఏం ఉండదు. డిజిటల్గానే పెట్టుబడి కింద పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ బంగారం ధర పెరిగితే దానికి అనుగుణంగా ఇన్వెస్టర్లకు రిటర్న్స్ వస్తుంటాయన్న మాట. ఇక ఇందులో కాల పరిమితి 8 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ.. ఐదేళ్ల తర్వాత ముందుగానే ఉపసంహరించుకునేందుకు వీలుంటుంది. దీని కోసం ఐదేళ్ల తర్వాత ప్రతిసారీ ముందస్తు రిడెంప్షన్ ధరను ప్రకటిస్తుంటుంది. ఇక 8 సంవత్సరాలు దాటిన తర్వాత.. పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.
కొంత కాలంగా రుణ భారం నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను కొత్తగా జారీ చేయట్లేదు. అయితే 2017-18 సిరీస్ V గోల్డ్ బాండ్లకు సంబంధించి.. రిడెంప్షన్ ధరల్ని ప్రకటించింది. అక్టోబర్ 30 అంటే నేటి నుంచే రిడీమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం తరఫున .. ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుందని చెప్పొచ్చు.
ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA).. ఇష్యూ డేట్, రిడెంప్షన్ డేట్కు ముందు 3 రోజుల సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తుంది. దీనిని ఆర్బీఐ ప్రకటిస్తుంది. 2017-18లో ఈ బాండ్లను జారీ చేయగా.. అప్పుడు గ్రాము ధరకు రూ. 2,971 గా నిర్ణయించగా.. ఆన్లైన్లో అప్లై చేసి.. డిజిటల్ పేమెంట్ చేస్తే గ్రాముకు రూ. 50 డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ గ్రాముకు రూ. 2,921 గా ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు రిడెంప్షన్ ధర గ్రాముకు రూ. 11,992 గా నిర్ణయించింది. అంటే ఎంత రిటర్న్స్ వచ్చాయో మీరే ఊహించుకోవచ్చు.
ఇక్కడ రిటర్న్స్ చూస్తే.. గ్రాముకు రూ. 11,992- రూ. 2,921= రూ. 9071 గా ఉంది. దీనిపై ఇంకా వడ్డీ అదనంగా వస్తుంది. ఇది వార్షిక ప్రాతిపదికన 2.50 శాతంగా ఉంది. దీంతో ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ (9071/2921)x 100 = 311 శాతం రిటర్న్స్ వచ్చింది. ఇది వడ్డీ కాకుండానే. అంటే రూ. 1 లక్షతో అప్పుడు గోల్డ్ బాండ్లలో చేరిన వారికి.. రూ. 4.11 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. ఇంకా.. వడ్డీతో ఇది ఎక్కువగానే ఉంటుంది.