Yuvagalam : లోకేష్`యువగళం`కోలాహలం,సంప్రదాయబద్ధంగా పయనం
భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు.
- By CS Rao Published Date - 05:54 PM, Wed - 25 January 23
భావోద్వేగాల నడుమ హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు(Yuvagalam) బయలు దేరారు. తల్లి భువనేశ్వరి, తండ్రి నారా చంద్రబాబునాయుడు(CBN), మామ బాలక్రిష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. అత్తమామలు, తల్లీదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలను అందుకున్నారు. సతీమణి బ్రాహ్మణి వీరతిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపారు. అభిమానుల కోలాహలం నడుమ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాత ఎన్టీఆర్ కు నివాళర్పించారు. ఆ తరువాత షెడ్యూల్ ప్రకారం కడపకు లోకేష్ బయలు దేరారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈనెల 27న ప్రారంభం. కానున్న యువగళం వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
హైదరాబాద్ నివాసం నుంచి లోకేష్ పాదయాత్రకు (Yuvagalam)
పాదయాత్రకు(Yuvagalam) బయలుదేరిన లోకేష్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని, వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కాని వారు లేరని అన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను వైసీపీ నేతలు హరించారని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాక్షస పాలన సాగిస్తున్నారని, ఏపీలో ప్రశ్నించే ప్రతిపక్షంపై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి కొత్త పరిశ్రమలు రావడంలేదని.. ఉన్నవాటిని తరిమేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
Also Read : Yuvagalam : లోకేష్ పాదయాత్రకు పోలీస్ అనుమతి, సవాలక్ష కండీషన్లు!
ఏపీలో వికృత రాజకీయానికి వైసీపీ నేతలు తెరలేపారని నారా లోకేష్ అన్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, పోలీస్ వ్యవస్థను జగన్రెడ్డి తన ఫ్యాక్షన్ రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు. జగన్రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో అన్నివ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఏపీని సంక్షోభంలోకి నెట్టేస్తున్న జగన్ సర్కార్ను గద్దెదింపాల్సిందేనని లోకేష్ పిలుపిచ్చారు. ప్రజల తరపున ఉద్యమించాలని తాను నిర్ణయించుకున్నానని, సైకో పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకనవుతానని నారా లోకేష్ అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి, అరాచక సర్కార్తో పోరాడటానికి సారధిగా వస్తున్నానన్నారు. యువతకు భవితనవుతా.. అభివృద్ధికి వారధిగా నిలుస్తానన్నారు. రైతన్నను రాజుగా చూసేవరకూ విశ్రమించేది లేదని, మీరే ఒక దళమై, బలమై తన యువగళం యాత్రను నడిపించండి అంటూ లోకేష్ బహిరంగ లేఖ రాశారు.
యువగళం యాత్రను నడిపించండి అంటూ లోకేష్ బహిరంగ లేఖ
అమెరికాలో ఉన్నత చదువు పూర్తి చేసిన నారా లోకేష్ ప్రపంచ బ్యాంకులో తొలుత ఉద్యోగం చేశారు. ఆ సందర్బంగా నగదు బదిలీ పథకాన్ని తొలుత రచించారు. దాన్ని 2009 ఎన్నికల్లో విస్తృతంగా ప్రజల మధ్య టీడీపీ తీసుకెళ్లింది. ఆ తరువాత ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్ గా టీడీపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందుగా చంద్రబాబు చేసిన `వస్తున్నా మీకోసం..` యాత్రకు అన్నీతానై చూసుకున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత రెండేళ్లకు లోకేష్ పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన సేవలు అవార్డులను, రివార్డులను అందుకున్నాయి. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఆయన చేసిన పోరాటం నాయకునిగా ఆయన్ను తీర్చిదిద్దింది.
Also Read : Yuvagalam : లోకేష్ యాత్రకు అల్టిమేటం!బాలయ్య వ్యాఖ్యలతో డైవర్షన్ పాలిటిక్స్ !!
తొలి రోజుల్లో లోకేష్ ను పప్పుగా వైసీపీ చిత్రీకరించింది. ఆ తరువాత ఆయన విద్యార్థులు, ఉద్యోగులు, యువత కోసం చేసిన పలు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండా చేయడానికి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసి గెలుపొందారు. నిరుద్యోగుల విషయంలోనూ ఆయన చేసిన పోరాటం కారణంగా ఉద్యోగ కల్పన కొంత మేరకు జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల మీద చేసిన దాడులను నిరసిస్తూ క్షేత్రస్థాయిలో ఆయన చూపిన చొరవ క్యాడర్ కు ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. సీనియర్లు సైతం. ఇప్పుడు ఆయన నాయకత్వానికి జేజేలు పలుకుతున్నారు. యువగళం విజయవంతం ఆయన్ను భవిష్యత్ లీడర్ గా తీర్చిదిద్దబోతుంది. అందుకే, చంద్రబాబునాయుడు(CBN) తెరవెనుక ప్లానింగ్ అంతా చేశారు. రాబోవు రోజుల్లో కాబోయే సీఎంగా లోకేస్ ఫోకస్ కావడానికి ఇదో సదావకాశంగా టీడీపీ అగ్రశ్రేణి భావిస్తోంది.
Related News
Kurchi Madathapetti : ‘కుర్చీ మడతబెట్టి’ సాంగ్లో ఇంతుందా మీనింగ్.. చంద్రబాబుతో పోలుస్తూ ఏమన్నా చెప్పిందా..
'కుర్చీ మడతబెట్టి' సాంగ్లోని లిరిక్స్ తో చంద్రబాబుతో పోలుస్తూ చెప్పిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.