YCP Party: కోడిగుడ్లకు వైసీపీ రంగులు.. ఇదేమీ ప్రచారం అంటున్న జనం
ఎన్నికలు సమీపిస్తున్నాయంటేనే ప్రధాన పార్టీలు అనేక రకాలుగా ప్రచార పర్వానికి దిగుతాయి.
- By Balu J Published Date - 04:22 PM, Fri - 28 July 23
ఎన్నికలు సమీపిస్తున్నాయంటేనే ప్రధాన పార్టీలు అనేక రకాలుగా ప్రచార పర్వానికి దిగుతాయి. గడియారాలు, అంబ్రెల్లా, టోపీలు లాంటి వస్తువులకు రంగులేసి ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే ఏపీలో అధికార పార్టీ ప్రచార తీరుపై ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ప్రచారానికి కోడిగుడ్లను కూడా వాడుకుంటారా అంటూ మండిపడుతున్నాయి. పిల్లలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద ఇచ్చే గుడ్లపై వైఎస్సార్ ఎస్సీ అని, జగనన్న గోరుముద్ద కింద అందించే గుడ్లపై జేజీఎమ్ అని ముద్ర వేసి పంపిణీ చేయడం కనిపించింది.
ఇది ఏపీలో కొన్ని ఏరియాల్లో మాాత్రమే కనిపించింది. పార్టీ నేతలు చేశారా? అధికారులు చేశారా? అనేది తెలియాల్సి ఉంది. వైఎస్సార్ పోషణ కింద ప్రతినెలా ఆంగన్వాడీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు 25 చొప్పున, గిరిజన ప్రాంతాల్లో అయితే వీరికి 30 చొప్పున కోడిగుడ్లు ఇస్తారు. ఎన్నికల వస్తుండటంతో గుడ్లపై రంగులు కనిపించాయి. సంపూర్ణ పోషణ పథకాన్ని షార్ట్ కట్ చేసి కోడిగుడ్లపై ముద్రించి మరీ పంపిణీ చేస్తున్నారు.
ప్రతినెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు కోడిగుడ్లపై పింక్ కలర్, 11 నుంచి 20వ తేదీ వరకు సరఫరా చేసే గుడ్లపై బ్లూ కలర్, 21 నుంచి నెల చివరి వరకు గ్రీన్ కలర్ వేసిన కోడి గుడ్లను పంపిణీ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు కోడిగుడ్లపై కలర్లు ముద్రిస్తూ వచ్చారు. గుడ్లను కూడా రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఇష్యూపై వైసీపీ నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
కాగా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలంటే ఉద్దేశంతో వైఎస్ జగన్ సర్కార్ 2020 జనవరి 21వ తేదీన జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం సోమవారం మధ్యాహ్నం అన్నం, గుడ్డు, శనగపిండితో చేసిన వంటకాన్ని వడ్డిస్తారు. మంగళవారం పులిహోర్, టమాటో పప్పు, గుడ్డు, బుధవారం వెజిటబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గుడ్డు, చిక్కు, గురువారం పోలెంట, టమాటోసాస్, గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకు కూర, కోడిగుడ్డు, చిక్కు, శనివారం అన్నం, సాంబారు, పాయసం లేదంటే స్వీట్ పొంగల్ వడ్డిస్తారు.
Also Read: Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ