AP DSC : గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు.. ‘టెట్ హాల్టికెట్’ నంబర్ల ఎంట్రీపై ప్రశ్నలు
AP DSC : తమ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని పలువురు ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- By Pasha Published Date - 01:00 PM, Mon - 19 February 24

AP DSC : తమ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని పలువురు ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కసరత్తు లేకుండా హడావుడిగా ప్రకటన విడుదల చేసి తమను ఇబ్బందిపెడుతున్నారని వారు అంటున్నారు. డీఎస్సీకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైనా సమస్య ఏర్పడితే సంప్రదించాలంటూ ప్రభుత్వం ప్రకటించిన హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు సరిగ్గా పనిచేయడం లేదని వాపోతున్నారు. డీఎస్సీ(AP DSC) ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో 2011 నుంచి ఇప్పటివరకు రాసి టెట్ పరీక్షల హాల్టికెట్ నెంబర్లు ఎంటర్ చేయాలనే నిబంధన పెట్టరాని.. అయితే ఆ ఆప్షన్లో వివరాలను ఎంటర్ చేసేందుకు అనువైన ఏర్పాట్లు లేవని అభ్యర్థులు చెబుతున్నారు. గత 13 ఏళ్ల టెట్ పరీక్షల హాల్టికెట్ల నెంబర్లు అభ్యర్థుల వద్ద ఇప్పటిదాకా ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఏడాది 18వ తేదీ వరకు టెట్ అప్లికేషన్లు స్వీకరించారు. ఇప్పటి వరకు ‘టెట్ – 2024’ హాల్టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈనేపథ్యంలో 2024- టెట్ హాల్టికెట్ నంబర్లను డీఎస్సీ అప్లికేషన్లో ఎలా రాయాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 22వ తేదీతో డీఎస్సీ అప్లికేషన్ గడువు ముగియనుండటంతో ఎంతో ఒత్తిడి లోనవుతున్నామని అభ్యర్థులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
అదనంగా రూ.750 ఫీజుతో..
దరఖాస్తు సమయంలో తప్పులు సహజమని.. వాటిని సరి చేసుకోవడానికి అదనంగా రూ.750 ఫీజు వసూలు చేస్తుండటం సరికాదని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసే వారిలో చాలా మంది పేద, మధ్యతరగతి వారే ఉంటారని గుర్తు చేస్తున్నారు. డీఎస్సీకి దరఖాస్తు చేసే సమయంలోనూ అభ్యర్థులు వెబ్సైట్లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తు చేసే సమయంలో నాన్ లోకల్ అనే ఆప్షన్ను ఎంపిక చేసుకుంటే 13 జిల్లాల పేర్లు చూపించాలి. కానీ డీఎస్సీ అప్లికేషన్ ఫామ్లో నాన్ లోకల్ అనే ఆప్షన్ ఒక్కటే చూపిస్తోంది. జిల్లాల జాబితా కనిపించడం లేదు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు లోనవుతున్నారు.
Also Read : Chhatrapati Shivaji : ఛత్రపతి శివాజీ జయంతి.. ఆ మహాయోధుడి జీవిత విశేషాలివీ
జిల్లాల జాబితా, జోన్ల జాబితా కనిపించట్లేదు
రాష్ట్ర వ్యాప్తంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 2,280 ఉన్నాయి. వీటిలో 1,022 పోస్టులు ఒక్క కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. వేరే జిల్లా అభ్యర్థి ఈ జిల్లాలో మెరిట్ కోటా 15 శాతం కింద దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ) పోస్టులు జోనల్ స్థాయిలో ఉన్నాయి. సాధారణంగా ఒక జోన్లో ఉన్న వారు ఎక్కువ పోస్టులు ఉన్న మరో జోన్కు దరఖాస్తు చేసుకుంటారు. ఆ సమయంలో నాన్ లోకల్ కోటా కింద అప్లై చేస్తే అన్ని జోన్లు కనిపించాలి. అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్ను ఎంచుకుని దరఖాస్తు పూర్తి చేస్తారు. అయితే తాజా డీఎస్సీ దరఖాస్తులో నాన్ లోకల్ అనే ఆప్షన్ ఒక్కటే వస్తోంది తప్ప జోన్ల జాబితాను చూపించడం లేదు.