Train Accident : ఏపీలో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Train Accident : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి విశాఖ - పలాస ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొన్న ఘటనతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి.
- By Pasha Published Date - 07:42 AM, Mon - 30 October 23

Train Accident : విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి విశాఖ – పలాస ప్రత్యేక పాసింజర్ రైలును విశాఖ–రాయగడ రైలు వెనుక నుంచి ఢీకొన్న ఘటనతో వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లు యథాతథంగా నడుస్తున్నప్పటికీ.. విజయనగరం వైపు వెళ్లాల్సిన, విజయనగరం వైపు నుంచి రావాల్సిన పలు రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చెన్నై సెంట్రల్–హౌరా (12842) కోరమాండల్, యశ్వంత్పూర్–పూరీ (22842) గరీబ్రథ్ ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. మరికొన్ని రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో నిలిపారు. ఇవాళ నడవాల్సిన రాయ్పూర్–విశాఖపట్నం–రాయ్పూర్ (08527/08528) పాసింజర్ స్పెషల్ను రద్దు చేశారు. ఆదివారం రాత్రి బయల్దేరాల్సిన విశాఖపట్నం–కోర్బా ఎక్స్ప్రెస్ రద్దయింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ రైళ్లను దారిమళ్లించారు
విశాఖపట్నం–విజయవాడ మీదుగా కాకుండా టిట్లాఘడ్–రాయ్పూర్–నాగ్పూర్–బల్హార్షా–విజయవాడ మీదుగా ఆదివారం దారి మళ్లించిన ట్రైన్లలో బారుని–కోయంబత్తూర్ (03357) స్పెషల్ ఎక్స్ప్రెస్, టాటా–ఎర్నాకుళం(18189) ఎక్స్ప్రెస్, భువనేశ్వర్–ముంబయ్ (11020) కోణార్క్ ఎక్స్ప్రెస్, హౌరా–సికింద్రాబాద్ (12703) ఫలక్నుమా ఎక్స్ప్రెస్, హౌరా–బెంగళూరు (12245) దురంతో ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
ఈ రైళ్ల రూట్ను కుదించారు..
రైలు ప్రమాదం నేపథ్యంలో ఈనెల 29న బయలుదేరిన పలు రైళ్ల రూట్ను కుదించారు. సంబల్పూర్–నాందేడ్(20809)ఎక్స్ప్రెస్ విజయనగరం వరకు నడిచింది. అక్కడి నుంచి తిరిగి సంబల్పూర్కు చేరుకుంది. పూరీ–తిరుపతి (17479) ఎక్స్ప్రెస్ బలుగాం వరకు నడిచి, అక్కడి నుంచి తిరిగి పూరీకి చేరుకుంది. విశాఖపట్నం–విజయనగరం (07468) రైలు పెందుర్తి నుంచి విశాఖకు చేరుకుంది. ఇక 28న ముంబైలో బయల్దేరిన ముంబై–భువనేశ్వర్ (11019) కోణార్క్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం వరకు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్–ముంబై (11020) రైలుగా ముంబైకు (Train Accident) బయల్దేరుతుంది.