Vizag : విశాఖలో ఆ రెండు ఆస్పత్రులు డేంజర్
ఒకప్పుడు విశాఖపట్నం కింగ్ జార్జి, విక్టోరియా జనరల్ ఆస్పత్రులు ప్రసవాలకు సురక్షితం. రోగులకు స్వర్గధామంగా ఉండేవి.
- By CS Rao Published Date - 06:00 PM, Sat - 25 June 22

ఒకప్పుడు విశాఖపట్నం కింగ్ జార్జి, విక్టోరియా జనరల్ ఆస్పత్రులు ప్రసవాలకు సురక్షితం. రోగులకు స్వర్గధామంగా ఉండేవి. వైద్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లడానికి రోగులకు భయం. ప్రసవాలకు వెళ్లడానికి గర్భిణులు వణికిపోతున్నారు. నవజాత శిశువులకు ఏ మాత్రం సురక్షితం కాదని ఇటీవల జరిగిన సంఘటనలు ద్వారా స్పష్టం అవుతోంది. నిరుపేద రోగులతో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ , విక్టోరియా జనరల్ హాస్పిటల్ నిండిపోవడం మామూలే. గోషా ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందిన విక్టోరియా ఆస్పత్రిలో ఒక సీలింగ్ ఫ్యాన్ హుక్ ఊడిపోవడంతో నేలపై కూలిపోయింది. ఇద్దరు నవజాత శిశువులు, వారికి పాలిచ్చే తల్లులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ఫ్యాన్ రెండు పడకల మధ్య పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ విషయాన్ని విక్టోరియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. సంఘటన తర్వాత, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున తనిఖీ చేయాలని కైండ్ జార్జ్ మరియు విక్టోరియా రెండు సూపరింటెండెంట్లను కోరారు.
ఫిబ్రవరి 2017లో విక్టోరియా జనరల్ హాస్పిటల్ మొదటి అంతస్తులో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడే పుట్టిన శిశువులు, వారి తల్లులు తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరో సంఘటనలో, గైనకాలజీ వార్డుకు అనుబంధంగా ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ లేబర్ రూమ్ సమీపంలోని టాయిలెట్లో అనుమానాస్పదంగా ఆడ శిశువు మృతదేహం కనుగొనబడింది. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించి ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ప్రాథమిక విచారణలో, శిశువు గైనకాలజీ వార్డులోని ఇన్పేషెంట్లలో ఎవరికీ చెందినది కాదని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం, ఈ ఆసుపత్రులలో గత నాలుగు నెలల్లో ఐదు నవజాత శిశువులు మరణించారు. ఇలాంటి సంఘటనల తరువాత ఆ రెండు ఆస్పత్రులు రోగులకు సురక్షితం కాదని తేలింది.