AP Liquor Case : సిట్ కు షాక్ ఇచ్చిన విజయసాయి రెడ్డి
AP Liquor Case : ‘‘కర్మ చేసే వాళ్లు అనుభవించక తప్పదు, కానీ కర్మ చేయాల్సిందే’’ అంటూ ఓ వ్యంగ్యాత్మక ట్వీట్ చేశారు
- By Sudheer Published Date - 05:06 PM, Sat - 12 July 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), గత ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కొద్ది రోజుల క్రితం ఏపీ వైసీపీ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం(AP Liquor Case)పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను మళ్లీ వార్తల్లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విజయసాయిని సాక్షిగా విచారించేందుకు నోటీసులు పంపారు. గతంలో మద్యం కేసుపై ఆయన వాంగ్మూలం ఇచ్చిన దృష్ట్యా, మరోసారి హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.
అయితే తాజాగా జరిగిన విచారణకు విజయసాయిరెడ్డి హాజరుకాలేదు. తాను ఇప్పటికే కొన్ని కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండటంతో విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే రెండు రోజుల్లో తాను ఎప్పుడు విచారణకు హాజరవుతానో తెలియజేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు తదుపరి విచారణ కోసం సమయాన్ని నిర్ణయించేందుకు వేచిచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ అంశం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
Thane School : ఆ అనుమానంతో విద్యార్థినులు దుస్తులు విప్పించిన స్కూల్ ప్రిన్సిపల్
ఇందుకోసం విజయసాయిరెడ్డి తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘‘కర్మ చేసే వాళ్లు అనుభవించక తప్పదు, కానీ కర్మ చేయాల్సిందే’’ అంటూ ఓ వ్యంగ్యాత్మక ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఆయన ఎవరి పట్ల ఈ సంకేతం పంపారన్నది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అదే పోస్టులో ఆయన అన్ని పార్టీలు రాజధర్మాన్ని పాటించాలని హిందీలో పేర్కొనడం కూడా విశేషంగా మారింది. దీనితో ఆయన వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించిందా? లేక ఏదైనా ఇతర పరిస్థితులను సంకేతించాయా అన్నదానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
రాజకీయాలకు దూరమయ్యానంటూ ప్రకటించినప్పటికీ, విజయసాయిరెడ్డి ఎక్స్లో మాత్రం చాలా యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ఆయన చేసే పోస్టులు పలు విషయాల్లో ప్రభుత్వాలకు మార్గదర్శకంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆయన మళ్లీ వైసీపీలోకి చేరే అవకాశాలపై కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ వీటిపై విజయసాయిరెడ్డి ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయినప్పటికీ, మద్యం కేసులో ఆయనపై సిట్ దృష్టి పడటంతో రాజకీయ రంగంలో మళ్లీ ఆయన చర్చకు కేంద్రంగా మారారు.