Venkaiah Naidu: సాహిత్యానికి, సంస్కృతికీ నెల్లూరు జిల్లా పుట్టినిల్లు!
మన పొరుగు ఉన్న రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
- Author : Balu J
Date : 27-04-2022 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
మన పొరుగు ఉన్న రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి పర్యటించి పలు పనులను ప్రారంభించారు. 1963లో రిలే కేంద్రంగా ఉన్న కడప ఆకాశవాణి 1975లో పూర్థి స్థాయి మూడు ప్రసారాలు మొదలు పెట్టింది అని, 90వ దశకంలో తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎఫ్.ఎం. రేడియో కేంద్రాలు వచ్చాయి అని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఎఫ్.ఎం. ఉంది. మధ్యలో నెల్లూరికే లేదు. ఆ కొరత ఈ రోజు సఫలమైంది అని, సాహిత్యానికీ, సంస్కృతికీ నెల్లూరు జిల్లా పెట్టింది పేరు అని, భారతాంధ్రీకరణ చేసిన కవిత్రయంలో తిక్కన మొదలుకుని ఆధునికుల వరకూ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు ఆయన అన్నారు.
దువ్వూరి రామిరెడ్డి, వేదుల వెంకటరాయశాస్త్రి, వావిళ్ల రామస్వామి శాస్త్రులు, దీపాల పిచ్చయ్య శాస్త్రి, మరుపూరు కోదండ రామిరెడ్డి… ఇలా ఎన్ని పేర్లు స్మరించినా వరుస పూర్తి కాదు అని ఉపరాష్ట్రపతి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా రాజనీతిజ్ఞులైన డా. బెజవాడ గోపాలరెడ్డి 1962 ఏప్రిల్ 10న పదవీ స్వీకారం చేశారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. సంపాదన ద్వారా వచ్చే తృప్తి కంటే సేవలో లభించే సంతృప్తి వెలకట్టలేనిది అని, సొంత లాభం కొంత మానుకుని, పొరుగు వారికి తోడుపడవోయ్ అన్న శ్రీ గురజాడ వారి మాటలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ కోసం ముందుకు రావాలని ఉప రాష్ట్రపతి కోరారు.