TTD: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం – టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- By Prasad Published Date - 09:22 PM, Mon - 11 July 22

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎప్పటిలా వైభవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
ఆనందనిలయం బంగారు తాపడం పనులకు ఆగమ పండుతుల సలహాలు మేరకు మరో నెలలో నిర్ణయం తీసుకుంటామని.. బాలాలయంలో పనులు చేయడం వీలుకాదు కాబట్టి, టెక్నాలజీని వినియోగించి తాపడం పనులు నిర్వహించడంపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. తిరుమలలో అక్టోపస్ భవన నిర్మాణానికి రూ 7 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు.
ప్రస్తుతం అమలవుతున్న విధంగానే సర్వదర్శన విధానం కొనసాగుతుందని. ఎస్.ఎస్.డి టోకన్లు జారీ పునరుద్ధరణ పై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ 2.07 కోట్లు నూతన పారువేటు మండపం నిర్మాణం, రూ 7.30 కోట్లు ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు టెండర్ ఖరారు చేశామని తెలిపారు. అమరావతి శ్రీవారి ఆలయంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రూ 2.09 కోట్లు, బేడి ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉన్న రాగి కవచానికి బంగారు తాపడానికి 18.75 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ పాఠశాలను సింఘానియా ఎడ్యుకేషన్ ముంబై ద్వారా మోడర్న్ స్కూల్ కు రూపొందించాలని నిర్ణయంతో పాటు.. 8 రకాల టీటీడీ క్యాలండర్ లు, డైరీలు ముద్రణకు టెండర్ ఆహ్వానించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. రూ 4.42 కోట్లతో తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రి ఐటి డెవలప్మెంట్, శ్రీవారి ఆలయ పొటు మోడ్రనైజడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.