NTR’s Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం ఇదే!
ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు.. తెలుగుజాతి ఔన్నత్యానికీ, తెలుగు వాడి ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
- By Balu J Published Date - 01:47 PM, Tue - 28 February 23
నందమూరి తారకరామారావు బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ఈ రోజు విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం.సినీ, రాజకీయ రంగాలలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన శకపురుషుడు ఆయన. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు.. తెలుగుజాతి ఔన్నత్యానికీ, తెలుగు వాడి ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకే కాదు. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం.
సినీ,రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు. ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్ రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి..ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్. దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.రాముడు ఎలా ఉంటాడాంటే, ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఏతరం వారిని అడిగినా ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు.
కృష్ణుడు,వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లాగానే ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు,భారతీయ సినిమాకు ఆయన చిరునామా…అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అని ప్రకటించి,పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే,ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆతొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించి విజయం సాధించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది.
Tags
Related News
Chandrababu Nomination: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇది మండల వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.