TDP vs YSRCP : సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి, మేకపాటి
- By Prasad Published Date - 08:36 AM, Sat - 16 December 23
వైసీపీలో అసంతృప్తిగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలిచారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు టీడీపీకి మద్దతు ఇవ్వడంతో టీడీపీ ఎమ్మెల్సీ సీటుని గెలిచింది. అనధికారికంగా వారు టీడీపీలో ఉన్నప్పటికి.. తాజాగా వారంతా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వారి అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు సార్లు, ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను చాలా మంది ముఖ్యమంత్రులను చూసాను కానీ ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజలను హింశించే ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి ఎలా భరించాడో తెలియదని.. వైఎస్ఆర్ కుమారుడని, ఒక్క ఒక్క ఛాన్స్ అన్నాడని బంపర్ మెజారిటీతో ప్రజలు గెలిపించారు తప్ప ఎదో చేస్తాడని కాదన్నారు. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే జగన్ రెడ్డి మాత్రం ఒక్క పర్యాయానికే రాష్ట్రాన్ని కాలబెట్టేశాడని ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉదయగిరిలో తాను తప్పా ఎవరూ గెలవరు అని చెప్తే తన టిక్కెట్టును అమ్మేశారని మేకపాటి ఆరోపించారు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని..తనకు తెలుగుదేశంలో మంచి మిత్రులున్నారని తెలిపారు.వారు చెప్పిన ప్రకారం తాను తెలుగుదేంలో చేరానని.. ఇక్కడ తనకు చాలా గౌరవం దక్కిందన్నారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రి టిక్కట్లను అమ్ముకుంటూ ఇన్ఛార్జులను మార్చుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం నల్లేరు మీద నడకేనని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. వైసీపీ అవినీతి పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలంతా సిద్దంగా ఉన్నారని.. ప్రతి గడపకు పసుపు ఎలా రాస్తామో ప్రతి ఇంటిపై పసుపు జెండా ఎగురవేయాలన్నారు. దళిత ఎమ్మెల్యే అయిన తనను వైసీపీ నుంచి అరాచకంగా సస్పెండ్ చేశారని.. స్విగ్గీ , జొమెటా లో ఇంట్లో సరుకులు డోర్ డెలివరీ వస్తాయి కానీ ఏపీలో మాత్రం శవాలు డోర్ డెలివరీ వస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవరైన సుబ్రమణ్యంను చంపినా చర్యలు లేవని,. అమరావతిని మార్చను అని జగన్ రెడ్డి ప్రమాణం చేసి మాట తప్పారని విమర్శించారు.
Related News
Chiranjeevi : మే 10న చంద్రబాబును చిరంజీవి కలవనున్నారా?
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన పోలింగ్ రోజుకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి.