TDP : సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత గుడ్ న్యూస్..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు.
- Author : hashtagu
Date : 16-09-2022 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నవారికి టికెట్లు ఖాయమన్నారు. ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉందని…తన వైఫల్యాలను ఎమ్మెల్యేల పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని బాబు విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు టికెట్ రాదనే భయంలో ఉన్నారని తెలిపారు. మరికొంతమందికి టికెట్ వచ్చినా గెలవలేమన్న ఆందోళనలో ఉన్నట్లు చెప్పారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం లేదన్న చంద్రబాబు…ప్రజా సమస్యలపై వారు చేస్తున్న పోరాటం వారిని గెలిపిస్తుందన్నారు. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ తోపాటు అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేసినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిపై మాట మార్చారాన్నారు. స్వార్థ రాజకీయాల కోసం జగన్ ఈ కుట్రలు పన్నుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.